రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఉన్నారంటూ ఇటీవల వార్తలు వస్తున్న క్రమంలో ఆయా వర్గాలకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తూ వారికి గుడ్ న్యూస్ అందిస్తున్నారు. రీసెంట్ గా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)ల పదోన్నతులపై కీలక నిర్ణయం తీసుకుని వారికి ప్రమోషన్లు కల్పించిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలో పదివేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటి డీఇఓ. ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులుగా పది వేల మందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 22 సంవత్సరాలుగా పదోన్నతుల సమస్య ఉండగా, జగన్ సర్కార్ ఈ సమస్య పరిష్కారం చూపిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల కు గానూ ప్రభుత్వం అదనంగా 666 ఎంఈఓ, 36 డిప్యూటి డీఈఓ పోస్టులకు అనుమతి మంజూరు చేసింది. ఇదే క్రమంలో 2,300 మంది ఉపాధ్యాయులకు తాము బోధించే సబ్జెక్ట్ లను మార్చుకునే అవకాశం కల్పించింది. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా సెప్టెంబర్ నెలలో ప్రమోషన్లు ఉండనున్నాయి. తదుపరి ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని చెబుతున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్టయం పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.