YS Jagan : రాష్ట్రంలోని రేషన్ డీలర్ లకు జగన్మోహనరెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న కమీషన్ విడుదలకు చర్యలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ నెల వరకూ రేషన్ షాపుల ద్వారా డీలర్ లు రెండు విడతలుగా కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఎనిమిది నెలలు రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేయగా వీటికి సంబంధించిన పిఎంజీకెఎవై కమీషన్ విడుదల కాలేదు.
ఈ కమీషన్ సమస్యపై డీలర్ల సంఘ నేతలు పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం డీలర్లకు ఓ వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి రేషన్ సరుకులను క్రెడిట్ పద్దతిలో అందజేసింది. కాగా బుధవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పీఎంజికెఎవై కమీషన్ విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఎనిమిది నెలల కమీషన్ ఒకే సారి విడుదలకు చర్యలు తీసుకోవడం పట్ల డీలర్ ల సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కమిషనర్ కోన శశిధర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.