YS Jagan : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ YCP Govt అభీష్టానికి భిన్నంగా పంచాయతీ Panchayati ఎన్నికలు వచ్చేశాయి. తొలి నుండి స్థానిక ఎన్నికలు ఎలాగోలా ఆపేయవచ్చు అన్నట్లుగా వైసీపీ భావించింది. అయితే సుప్రీం కోర్టు కూడా స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లోని పెద్దలను ఆకర్షించేందుకు ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహాక బహుమతులను భారీగా పెంచేశారు. జనాభా దామాషా ప్రకారం రూ.5లక్షల నుండి 20 లక్షల వరకూ ఇచ్చేస్తామంటూ ప్రకటించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో గ్రామ పెద్దలు కూర్చుని చర్చించుకుని ఏకగ్రీవాలకు సహకరిస్తారు. పెద్ద సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం అయి పోతాయి, అవి వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చు అన్నది ప్లాన్. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు కనిపిస్తోంది. తొలి దశ ఎన్నికలకు భారీగా నామినేషన్ దాఖలు అయ్యాయి. ఈ విషయం ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారమే తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. వివిధ కారణాల వల్ల స్క్రూటినీలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్ లు తిరస్కరణకు గురి అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19,491 సర్పంచ్ పదవికి నామినేషన్ లు దాఖలు కాగా వాటిలో 1323 నామినేషన్ లు తిరస్కరణకు గురి అయ్యాయి. 18,168 మంది సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. సర్పంచ్ పదవులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 349, విశాఖ జిల్లాలో 152, తూర్పుగోదావరి జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 138, అనంతపురంలో 112, గుంటూరులో 84, కృష్ణాలో 76, శ్రీకాకుళంలో 62, కర్నూలులో 62, కడపలో 54, పశ్చిమ గోదావరి జిల్లాల 52, నెల్లురులో 41 నామినేషన్లను తిరస్కరించారు.
వార్డు మెంబర్ పదవులకు 79,799 నామినేషన్ లు దాఖలు కాగా కేవలం 2245 నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులకు భయపడి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పోటీల నుండి తప్పుకోవడమో లేక సైలెంట్ గా ఉండటమే చేస్తుండగా అధికార పార్టీకి రెబల్స్ తోనే ఎక్కువ తలనొప్పి అయ్యింది. దీంతో కొన్ని చూట్ల వైసీపీలోని రెండు వర్గాల నాయకుల మధ్యే పోటీలు ఎదురవుతోంది. నేతలు నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి సారించినప్పటికీ ఆశించిన ఫలితాలు కనబడటం లేదని అంటున్నారు.