AP CM YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్లకు వెళుతున్నారు. మాచర్లలో జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్ సత్కరించనున్నారు. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వేడుకలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించడం ద్వారా రాష్ట్రంలో ఈ వేడుకలను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో బయలుదేరి 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 గంటలకు మాచర్ల పట్టణంలోని పిడబ్ల్యుడి కాలనీలోని పింగళి వెంకయ్య కుమార్తె నివాసానికి చేరుకుంటారు. ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను సత్కరించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకుంటారు.