YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖాతాలో మరో తీపి గుర్తు. రాయలసీమ వాసులు గుర్తుంచుకునే గౌరవం ఇది. కర్నూలు ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలి ప్రయాణికుల విమానం బెంగళూరు నుంచి కర్నూల్ చేరుకుంది. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రెండు భారీ ఫైర్ ఇంజిన్లు నీటి జల్లులతో రాయల్ సెల్యూట్ చేస్తూ ప్రయాణీకులకు ఘన స్వాగతం పలికారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా. ఫక్కీరప్ప ప్రయాణీకులకు స్వాగతం పలికారు. అదే విమానం తిరిగి విశాఖకు 75 మంది ప్రయాణికులతో బయల్దేరింది.
ఎయిర్పోర్ట్…
కర్నూలు ఎయిర్ పోర్ట్ ను సీఎం జగన్ 25న ప్రారంభించగా సాంకేతిక ప్రక్రియల అనంతరం బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన రాకపోకలు 28ప ప్రారంభం అయ్యాయి. బెంగళూరు నుంచి కర్నూలుకు 52 మంది ప్రయాణికులతో ఫస్ట్ ఫ్లైట్ కర్నూలు చేరుకుంది. ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ప్రయాణించారు. బెంగళూరు నుంచి ఉదయం 9.10 బయలుదేరిన విమానం 10.15కు కర్నూలు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. కర్నూలు-విశాఖపట్నం తొలి ఫ్లైట్ లో వెళ్లిన ప్రయాణీకులకు పుల్లారెడ్డి స్వీట్ బాక్సులను, స్మారక పోస్టల్ కవర్లను అందించి తొలి ఫ్లైట్ కు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జాతీయ జెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటికే రెండు విమానాశ్రయాలు
రాయలసీమలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. కడప, రేణిగుంటల్లో విమానాశ్రయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయంలో కలిపి మొత్తం మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఈ విమానాశ్రయం అందుబాటులోకి తెచ్చారు.