YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఇది ఊహించని సందర్భం. తన ప్రమేయం విషయంలో ఆయన కొద్దిరోజుల పాటు టార్గెట్ కానున్నారు.
ఇదంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి. ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గతంలో ప్రకటించారు. అయితే, బడ్జెట్ అలా లేదనేది అనేకమంది విశ్లేషణ. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏపీ సీఎం జగన్ పై విమర్శల దాడి మొదలైంది.
టీడీపీకి మంచి చాన్స్
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రం గురించి ఒక్క ప్రతిపాదన కూడా లేదని.. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాల ప్రస్తావనే రాలేదని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. బడ్జెట్లో ఏపీకి ఒక్క రూపాయి కూడా రాలేదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి.. తనను 31 కేసుల నుంచి తప్పిస్తే చాలు.. ప్రత్యేక హోదా ఊసెత్తనని 28 ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు .
YS Jagan : జగన్ టీం ఏమంటోంది?
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ లోక్సభాపక్ష నేత మిధున్ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి సోమవారం ఇక్కడి విజయ్ చౌక్లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ను బడ్జెట్లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల బడ్జెట్లా ఉందని అన్నారు.
బీజేపీ భలే మాటలు చెప్తోంది
బడ్జెట్లో ప్రస్తావన లేకపోతే నిధులు, మొండిచేయి చూపినట్లు కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పోలవరం గురించి రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ రానున్నట్లు ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు, బడ్జెట్ కేటాయింపుల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. మొత్తంగా కొద్దిరోజుల పాటు బడ్జెట్ కేంద్రంగా సీఎం జగన్ విపక్షాలకు టార్గెట్ కానున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.