YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ తీపి కబురు. ఏపీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సిగ్నల్స్ వస్తాయో అనుకున్న వారికి షాకిచ్చేలా … ఏపీ సర్కారు నిర్ణయానికే జై కొట్టింది.
ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే పరిపాలన రాజధాని విశాఖపట్టణానికి తరలించే పనిలో బిజీగా ఉన్న ఏపీ సర్కారుకు ఇది పెద్ద గుడ్ న్యూస్ .
YS Jagan జగన్ కు ఇది గుడ్ న్యూస్
పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. `ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదనలు పంపించిందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? కర్నూలుకు హైకోర్టును తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన ప్రస్తుత పరిస్థితి; దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయం; ఒకవేళ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే, కర్నూలును లీగల్ కేపిటల్గా ఈ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుందా? తెలియజేయాలి` అని జీవీఎల్ కోరారు. దీనికి కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.
క్లారిటీ వచ్చేసిందిగా…
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారని తెలిపారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి తీసుకుంటుందని రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులను భరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తేల్చిచెప్పారు. తద్వారా కేంద్రం పరిమిత పాత్ర పోషిస్తుందని ,ఇంకా చెప్పాలంటే తమకు అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండగా ఇటీవలే రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో సీఎ క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లు సిద్దం అయ్యాయని తెలుస్తోంది. లే ఔట్ ప్లానుకు ఉడా ఆమోదం తెలిపిందని సమాచారం. విశాఖలో రూ. 113 కోట్లతో సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి ఉడా ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తాజాగా కేంద్రం ఇచ్చిన క్లారిటీ తోడయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.