YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ నిల్వలపై దృష్టి సారించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం భారీగా నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఏకంగా రూ.309.87 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో ఆక్సిజన్ కొరత విషయంలో కీలక ముందడుగు పడిందని అంటున్నారు.
సీఎం జగన్ సంచలన నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోగులకు వైద్యం, ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీంతో పాటుగా 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. 10వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహిణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే ఆరు నెలలకు రూ.60 లక్షల రూపాయలను మంజూరు చేసింది.
దానిపై స్పెషల్ ఫోకస్ ….
ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. నావికాదళం ఈఎన్సీ, విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను తూర్పు నావికాదళం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు నాలుగు ప్రత్యేక బృందాలు నావికా దళం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందానికి మూడు నుంచి నాలుగు జిల్లాల ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఆక్సిజన్ ప్లాంట్ల లో సాంకేతిక లోపాలను సవరించేందుకు సావికాదళం సాయం చేస్తుంది. సింగపూర్, థాయిలాండ్, మలేషియా దేశాల నుంచి 25 క్రయోజనిక్ ట్యాంకర్లను తరలించేందుకు నేవీ అంగీకరించింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు, వైద్య పరికరాల సరఫరాకు నేవీ అంగీకరించింది. 200 డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వానికి అందించేందుకు నేవీ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నిర్వరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తీరు పెద్ద ఎత్తున ఉపశమనం అని పలువురు పేర్కొంటున్నారు.