YS Jagan, Sharmila: ఈ రోజు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. తండ్రి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన సోదరి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల పులివెందులలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థనలో ఉదయం కలిసి పాల్గొంటారని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఉదయమే షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక విమానంలో కడప నుండి హైదరాబాద్ పయనమైయ్యారు.
Read More: KCR: జగన్ + రేవంత్ + కిషన్.. ముగ్గురు రెడ్ల తలరాతను ఒక్క నిర్ణయంతో మార్చేసిన కేసిఆర్
ఏపి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుండి నేరుగా అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్లారు. అక్కడ రైతు దినోత్సవంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. దివంగత వైఎస్ఆర్ బతికున్నంత కాలం రైతుల గురించే అలోచించారనీ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ నమ్మారని జగన్ పేర్కొన్నారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని వెల్లడించారు. వైఎస్ స్పూర్తిగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా సాగుతున్నామని జగన్ స్పష్టం చేశారు. పలు అబివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించిన వైఎస్ జగన్ సాయంత్రం ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద భార్య భారతితో కలిసి నివాళులర్పించారు. ప్రార్థనలో పాల్గొన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల, విజయమ్మ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం చేస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ నాయకత్వాన్ని నిలబెడతా..రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ప్రకటించారు. శుత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ఆర్ అని, ఆయన జయంతి అందరికీ పండుగ రోజు అని వెల్లడించారు. ఆయన చూపిన బాటలోనే వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీపీలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నారు. పేదరికం రూపుమాపడం, సంక్షేమం, స్వయం సమృద్ధి ఈ మూడు అంశాలపై పార్టీ దృష్టి పెట్టనుందని చెప్పారు.
ఇది యాదృశ్చికమో లేదా ముందుగా అనుకున్న విధంగా ఏర్పాటు చేసుకున్నారో తెలియదు కానీ జగన్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం. అదే సమయంలో ఆయన సోదరి షర్మిల హైదరాబాద్ లోని రాయదుర్గంలో పార్టీ ప్రకటన చేయడం గమనార్హం. గత ఏడాది వరకూ వైఎస్ వర్థంతి, జయంతి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వైఎస్ జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా ప్రార్థనలో పాల్గొనడంతో కొంత గ్యాప్ అయితే ఉన్నదనే విషయం ఇప్పుడు బహిర్గతం అయ్యింది.