YS Jagan Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ వ్యవహారం తారా స్థాయికి చేరుతోంది. ఇటు ఏపి, అటు తెలంగాణ అధికార పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా అక్కడ, ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఇది అధికార పార్టీల డ్రామాగా విమర్శిస్తున్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసిఆర్ మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయనీ, ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో సారి సెంటిమెంట్ రాజేయడానికి కేసిఆర్ ఎత్తుగడ అని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపిలో వివిధ అంశాలపై దృష్టి మరల్చడానికి సీఎం జగన్ నీటి అంశాన్ని లేవనెత్తారని అంటున్నారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం అయ్యే సమస్యను రాద్ధాంతం చేస్తున్నారంటే ఇందులో డ్రామా అని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ వివాదం నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఘాటు పదజాలంతో విమర్శించగా జగన్ సోదరి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసిఆర్ ను అదే తరహాలో విమర్శించడం విశేషం. నీటి కేటాయింపుల ఆధారంగా నిబంధనల మేరకే నీటిని వాడుకుంటున్నామని చెప్పిన ఏపి సీఎం వైఎస్ జగన్.. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు అప్పట్లో కేసిఆర్ శ్రీకారం చుడితే ఏపి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎం గాడిదలు కాస్తున్నారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుపై ఈ విధంగా జగన్ ప్రశ్నించగా షర్మిల ఇదే తరహాలో కేసిఆర్ ను ప్రశ్నించారు.
“రెండు సంవత్సరాలుగా పొరుగు రాష్ట్రంలో కృష్ణానది మీద ప్రాజెక్టులు కడుతుంటే కేసిఆర్ గారు ఇప్పుడే తెలివిలోకి వచ్చారా” అని ప్రశ్నించారు. “పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటకి ఆహ్వానించవచ్చు, కౌగిలించుకోవచ్చు, భోజనాలు పెట్టొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓండిచనూ వచ్చు కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయతీని మాట్లాడుకోలేరా” అంటూ షర్మిల పరోక్షంగా కేసిఆర్, జగన్ లను ఫ్రశ్నించారు.
సమస్యను సానుకూలంగా పరిష్కరించాలన్న ఆలోచన ఇద్దరు సీఎంలకు లేదనీ ఈ వివాదాన్ని పెంచి రాజకీయంగా లాభపడేందుకే ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే మాట ప్రతిపక్షాల నుండే కాక ప్రజల నుండి వినిపిస్తోంది.