YS Jagan Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి తదితర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించి, ప్రాధనలో పాల్గొన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తరువాత సోదరుడు జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
ఇంతకు ముందు వైఎస్ జయంతి సందర్భంలో ఇద్దరు తారసపడతారని భావించినా వేరువేరుగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన తరువాత అన్న చెల్లెలి మధ్య గ్యాప్ పేరిగిందని వార్తలు వచ్చాయి. ఇటీవల రాఖీ పండుగ రోజున కలుసుకోలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వర్థంతి రోజున కలిసి కార్యక్రమంలో పాల్గొంటారా లేక వేరువేరుగా పాల్గొంటారా అనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలకు భిన్నంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఘాట్ వద్ద ప్రార్ధనలో పాల్గొన్నారు. జగన్, షర్మిల ఇద్దరూ బుదవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట హౌస్ లోనే బస చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో అన్నా చెల్లెలి మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం అవుతోంది. గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పినట్లు అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు ఏమి లేవని తేలిపోయింది.
కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (ఎస్ఓపి) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీ సహా ఇతర విఐపీలను ప్రతి ఒక్కరి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్ర్కీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.