YS Jagan : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి నేతల జంపింగ్ లు ప్రారంభం అయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణల అనంతరం ఇంకాస్త వేడిగా రాజకీయం తయారు అవుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. బీజెపీ, జనసేన తమకు బలం ఉన్న గ్రామాల్లో అభ్యర్థులను నిలిపి తమ ఉనికిని చాటుకుంటోంది. సర్పంచ్ పదవి ఆశించి భంగపడిన నాయకులు పలు ప్రాంతాల్లో వెంటనే ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇలాకాలో (నివసిస్తున్న నియోజకవర్గంలో) వైసీపీ మండల స్థాయి నాయకుడు ఒకరు ఆ పార్టీకి షాక్ ఇచ్చి ప్రత్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. దుగ్గిరాల మండలంలోని కంఠంరాజు కొండూరు గ్రామం ఎస్సీలకు రిజర్వుడ్ అయ్యింది. ఈ గ్రామానికి చెందిన వైసీపీ మండల ఎస్సీ సెల్ నాయకుడు సుద్దపల్లి రమేష్ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావించారు. అయితే గ్రామంలోని వైసీీపీ నాయకులు వేరే నాయకుడికి ఖరారు చేయడంతో రమేష్ మనస్థాపానికి గురైయ్యాడు, వెంటనే దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు నందం అబద్దయ్య సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ మద్దతుతో రమేష్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ గ్రామంలో ఇరు పార్టీలు పంచాయతీ ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో రాజకీయం రసకందాయంగా మారింది. సీఎం జగన్మోహనరెడ్డి ఇలాకాలో ఓ వైసీపీ నాయకుడు పార్టీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరి సర్పంచ్ గా పోటీ చేయడం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ?