YS Jagan: జంగారెడ్డిగూడెం మరణాలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ అటు ఉభయ సభల్లోనూ, బయట ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ నిర్వహించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాలు ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు. మరో పక్క గతంలో ఎన్నడూ లేని మద్యం బ్రాండ్ లు రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభిస్తున్నాయనీ, ఇవి త్రాగడం వల్లనే ప్రజలు అనారోగ్యం పాలువుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముతున్న వాటిని జే బ్రాండ్ (జగన్ బ్రాండ్)గా టీడీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. అయితే టీడీపీ చేస్తున్న ఆరోపణలపై అనూహ్యంగా సీఎం జగన్ అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుకే లిక్కర్ బ్రాండ్ లను చుట్టేశారు.
YS Jagan: ఆ మద్యం బ్రాండ్లు అన్నీ చంద్రన్న కానుకలే
మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం జగన్..చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకు గానూ 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని అన్నారు. 2019 తరువాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గానీ తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. నవరత్నాలు, అమ్మఒడి తమ ప్రభుత్వ బ్రాండ్లు అయితే ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్ తదితర మద్యం బ్రాండ్లు అన్నీ చంద్రన్న కానుకలేనని ఎద్దేవా చేస్తూ ఇవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చిన డిస్టిలరీలలో తయారు చేసినవేనన్నారు.
నాటు సారా మరణాలు అంటూ తప్పుడు ప్రచారం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇస్తే గత ప్రభుత్వంలో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయన్నారు. కానీ ఈ బ్రాండ్లను మేము క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్ తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ అన్నారు. ఇదే సందర్భంలో నాటు సారా మరణాలు అంటూ తమ కుటుంబాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పలువురు బాధిత కుటుంబాలు మాట్లాడిన వీడియోలను అసెంబ్లీలో స్క్రీన్ పై చూపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందనీ, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని సీఎం జగన్ ఆక్షేపించారు.