YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆది నుంచి వెంటే ఉంటున్న అతికొద్ది మంది నమ్మినబంటుల్లో ఒకరు అంబటి రాంబాబు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సీనియర్ మరియు ముఖ్య నేత కూడా. ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు కు కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మంత్రి పదవి దక్కలేదు. దీనిపై ఆదిలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన అంబటి తను నమ్మిన నాయకుడి వెంటే సాగుతున్నారు. తాజాగా ఆయన కీలక అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఓ రేంజ్ లో కాపాడారు.
YS Jagan : రచ్చ రచ్చ పై రాంబాబు మార్క్ ట్విస్ట్..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించటం ఏపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వివిధ పార్టీలు తమ తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. అవతలి పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.చంద్రబాబు అండ్ కంపెనీ.. సీఎం వైఎస్ జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.. కేంద్ర రంగ సంస్థను రాష్ట్రం ఎలా అమ్మగలుగుతుంది అనే ఆలోచన కూడా లేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఆ అవకాశం ఉంటే చంద్రబాబు ఎప్పుడో అమ్మేసి ఉండేవారు కాదా? అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పై విరుచుకుపడి….
లాభాల్లో నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్.. చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్లిపోయిందని అంబటి రాంబాబు ఆరోపించారు. 54 ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు తన హయాంలో పప్పు బెల్లాల లాగా తన వారి చేతుల్లో పెట్టింది నిజం కాదా? అంటూ నిలదీసిన ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.. కావాలంటే అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లే ఆలోచన చేయవచ్చు అన్నారు అంబటి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చేయగలిగే అన్ని రకాల ప్రయత్నాలు మా ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పునరాలోచించే విధంగా ఒత్తిడి తీసుకుని రావాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు.
పవన్ పై అంతెత్తున…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాటలు విని ఆశ్చర్యం వేసిందని అంబటి రాంబాబు అన్నారు. బీజేపీతో భాగస్వామిగా ఉండి పవన్ మా మీద బురద చల్లటం విచిత్రంగా ఉందన్న ఆయన తమ మీద ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ చేస్తున్న బుద్ధిమాలిన పని అని ఫైర్ అయ్యారు.. ఇంతకూ పవన్.. ఢిల్లీ వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడమని అడిగారా? లేక తిరుపతి సీటు ఇవ్వమని బతిమాలుకున్నారా? అని ఎద్దేవా చేశారు. అయితే, రాబోయే మంత్రి వర్గ విస్తరణలో పదవి కొట్టేసేందుకే అంబటి రాంబాబు తమపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ , జనసేన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తుండటం కొసమెరుపు.