KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కరోనా కష్టకాలంలో తన రాజకీయ మిత్రుడిని వైఎస్ జగన్ టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు పెట్టారు. ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులను అనుమతించట్లేదు.
అంబులెన్సులు టీఎస్ సరిహద్దుల్లో ఆపటంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు సైతం ఉండటం గమనార్హం.
ఆ బార్డర్లో…
ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు పెట్టారు. ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులను సోమవారం అనుమతించలేదు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ.. అంబులెన్లను వెనక్కి పంపారు. ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా ఉందని అనుమతి పత్రం ఉంటేనే పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి బెడ్ దొరక్క ఆస్పత్రుల చుట్టూ తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతించారు.
ఫైరయిన వైసీపీ ఎమ్మెల్యే
అయితే, తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సామినేని కీలక వ్యాఖ్యలు చేసారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని అని పేర్కొన్న సామినేని ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని అన్నారు. “అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పోలీసులను కోరాం. హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్ లు ఆపటం అనైతికం. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలి. విడిపోయిన రాష్ట్రం మద్రాస్ కు వైద్యం కోసం వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నా“ అని వ్యాఖ్యానించారు.