YS Jagan : ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందనే సామెత చాలా మందికి తెలుసు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అనే సినీ పాట కూడా చాలా మందికి తెలుసు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓ పరిణామం ఈ సామెత, ఆ పాటకు తగినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంటింటి రేషన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో ఇంకా మంచి మార్కులు కొట్టేయాలకున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ వాహనాలు ఏర్పాటు చేసి వాహన ఆపరేటర్ లకు భారీగా జీతాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్కో వాహన డ్రైవర్ కు నెలకు రూ.16వేలు చెల్లించే విధంగా ఒప్పందాలపై సంతకాలు చేసి ఆపరేటర్ లు విదుల్లోకి వచ్చారు. ఈ విధులు చేపట్టిన మరుసటి రోజే వీరు ఆందోళన చేయడంతో మరో రూ.5 వేలు వేతనం పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ పంపిణీలో వాలంటీర్లు వ్యాన్ డ్రైవర్ లకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
YS Jagan : జీతాలు పెంచాలంటూవాలంటీర్ల ఆందోళన
అయితే ఈ పరిణామం ఏడాదిన్నర కాలంగా రూ.5 వేల వేతనంతో అనేక రకాల విధులను నిర్వహిస్తున వాలంటీర్లకు ఆగ్రహం తెప్పించింది. వాహన డ్రైవర్ లకు రూ.21వేలు ఇస్తున్న ప్రభుత్వం గాడిద చారికి చేస్తున్న తమకు రూ.5 వేలేనా ఇచ్చేది మాకు వేతనాలు పెంచాలి అంటూ ఆందోళన బాట పట్టారు. పెన్షన్ల పంపిణీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలలో కీలక పాత్ర పోషిస్తున్నామని వాలంటీర్లు పేర్కొంటున్నారు. తమకు వేతనం రూ.12 వేలు చేయాలని లేకుంటే వచ్చే నెల నుండి తమ సేవలు నిలుపుదల చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వాలంటీర్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జిల్లాల వారీగా వీరితో సమావేశాలను నిర్వహించారు. వాలంటీర్లు అంతా మన పార్టీ వాళ్లే ఉన్నారంటూ కూడా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం ఏమిటో చూసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ సూచించారని వార్తలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి ఈ సమస్యను ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి. మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో లక్షలాది మంది వాలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాకపోోవచ్చు అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో. ఇంత కాలం సైలెంట్ గా విధులు నిర్వహిస్తున్న వాలంటీర్ లు రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ల వేతనాల పెంపుదల చూసి ఆందోళన బాట పట్టడం గమనార్హం.