YS Jagan:ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం కారణంగా ఆయన్ను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చిత్రంగా టార్గెట్ చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన ఆయన తిరుపతి ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా తన ప్రచారాన్ని సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ ఆసక్తికరంగా స్పందిస్తోంది.
ఇందుకే జగన్….
తన తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకుంటూ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. “రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 31892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2765 మంది కరోనా పాజిటివ్ తేలింది. అందులో చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదయ్యాయని అలాగే నెల్లూరు జిల్లాలో కూడా 292 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరు అయితే నా మీద అభిమానంతో ఆప్యాయతతో వేలాది మంది తరలి వస్తారు. అయితే మీరందరూ నాకు ముఖ్యమేనని మీ ఆరోగ్యం ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న అన్నగా, తమ్ముడిగా తిరుపతిలో బహిరంగ సభ రద్దు చేసుకుంటున్నా“అని సీఎం జగన్ స్పష్టంగా తెలిపారు.
టీడీపీ కామెడీ మామూలుగా లేదు….
అయితే ఏపీ సీఎం జగన్ టూరు రద్దుపై తెలుగుదేశం పార్టీ వినూత్నంగా స్పందించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాలుకు స్పందించలేకే సీఎం జగన్ టూరు రద్దు చేసుకున్నారని పేర్కొంది. అయితే, ఇదే పార్టీ గతంలో జగన్ టూరుపై మరో కామెంట్ చేసింది. టీడీపీ ప్రచార జోరుకు తట్టుకోలేక సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని స్వయంగా నారా లోకేష్ విమర్శించారు. మొత్తంగా సీఎం జగన్ టూర్పై టీడీపీ విమర్శలు చిత్రంగా ఉన్నాయంటున్నారు.