YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున్నే చర్చకు కారణంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి పెట్టబోయే ఈ పార్టీ ఎఫెక్ట్ ఏంటి అనే విశ్లేషణ ప్రధాన స్రవంతి మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా మొదట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు అని తెలిపిన షర్మిల రెండు మూడు జిల్లాలపై ఫోకస్ పెట్టారు. అయితే, ఈ ట్రెండ్ మరింత విస్తరిస్తోంది.
ఆ జిల్లా ఏం జరుగుతోంది?
మొదట్లో ఖమ్మం , నల్లగొండ జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన షర్మిల ఇప్పుడు ఆ ఫోకస్ విస్తరించారు. లోటస్ పాండ్లో తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా టీఆర్ఎస్ సర్కారును ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నేడు వలసల జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఇక, 80 శాతం ప్రాజెక్టులు స్వర్గీయ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు.
జాబితా పెరుగుతోంది
కోహినూర్ వజ్రం జన్మస్థలం ఈ జిల్లాయే.. కానీ, కరువు జిల్లా, వలసల జిల్లా అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.. నాన్న (వైఎస్ఆర్) అనేవారు.. తాను చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే.. దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి.. అప్పుడు వలసలు ఆగిపోతాయి.. జిల్లా పచ్చగా ఉంటుందని.. కానీ, వలసలు ఆగాయా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను ఇంకా ఎందుకు పూర్తిచేయలేదని వైఎస్ షర్మిల కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు.