YS Sharmila focused on constituency party committees : తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు డిసైడ్ అయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులు, యువత, విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల జిల్లాల స్థాయిలో ముగ్గురితో కమిటీలను నియమించారు. ఇప్పుడు తాజాగా నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ఇంత వరకు ఖరారు కాలేదు కానీ రెండు మూడు ప్రచారంలో ఉన్నాయి. త్వరలో పార్టీ పేరు, జెండా, జెండా రంగులు తదితర విషయాలు వెల్లడించనున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కూడా షర్మిల నిర్ణయించుకున్నారు.
పార్టీ బలోపేతానికి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలే కీలకం. ముందుగా జిల్లా స్థాయి కమిటీలను నియమించిన షర్మిల ఇప్పుడు నియోజకవర్గ స్థాయి కమిటీలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా గురువారం లోటస్ పాండ్ లో ముఖ్య అనుచరులతో సమావేశమైయ్యారు. ఆనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కమిటీలే కీలకమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తామని తెలిపారు. కమిటీ వ్యవహారాల బాధ్యతను పిట్టా రాంరెడ్డికి అప్పగించామన్నారు. ఈ నెల 16వ తేదీలోగా కమిటీల నియామకం పూర్తి చేస్తామని షర్మిల తెలిపారు.
పార్టీ నిర్మాణంపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులు, సన్నిహితులతో షర్మిల సమావేశాలను నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదనీ, ప్రజలు సంతోషంగా లేరని పేర్కొంటున్నారు. నాటి రోజులు తీసుకురావాలన్నదే తన అభిలాషగా షర్మిల ముందుకు సాగుతున్నారు.