YS Sharmila : వైఎస్ షర్మిల… దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అనే గుర్తింపు నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేతగా గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన పార్టీకి తగిన గ్రౌండ్ ఆమె ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్ అభిమానులతో సమావేశమవుతున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునుంటున్నారు. అందుకోసం పలు ప్రశ్నలతో కూడిన పేపర్లు అభిమానులకు ఇచ్చి.. వారి స్పందనలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కసరత్తు చేస్తున్న తరుణంలోనే షర్మిలకు మద్దతు పెరుగుతోంది!
షర్మిల ఇది ఊహించలేదేమో
రాజన్న రాజ్యం నినాదంతో తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న షర్మిలపై తొలి రోజు నుంచే విమర్శల దాడి ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో పక్కరాష్ట్రాల వారి అవసరం లేదని అధికారపార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే సమయంలో విమర్శలతో పాటుగా ఆమెకు మద్దతు కూడా లభిస్తోంది. షర్మిల ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు పలికారు. తాజాగా ఓ సీనియర్ నేత తన సంఘీభావం తెలిపారు.
మాజీ హోంమంత్రి మద్దతు
అంజయ్య క్యాబినెట్ లో హోం మంత్రి గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి కే.ప్రభాకర్ రెడ్డి షర్మిలకు మద్దతు తెలిపారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి అప్తుడు అనే పేరుంది. ఆ అనుబంధంతోనే ఆయన షర్మిలకు మద్దతు పలికినట్టు చెబుతున్నారు. మొత్తంగా వైఎస్సార్ ముద్రతో ఎంట్రీ ఇచ్చిన షర్మిల పార్టీ ప్రకటన కంటే ముందే సీనియర్ల మద్దతు కూడగట్టడం విశేషమే!