YS Sharmila : దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. పార్టీ ఏర్పాటు పనుల్లో ఆమె బిజీగా ఉంటూ… వివిధ జిల్లాల అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త పార్టీపై షర్మిల దూకుడుపై అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి షర్మిల పార్టీపై ఘాటు కామెంట్లు చేశారు.
రేవంత్ సంచలన వ్యాఖ్యలు…
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకు షర్మిల పార్టీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ సమీకరణాలపై ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిల పార్టీపై రేవంత్ చేసిన కామెంట్లపై షర్మిల అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుని పోయిందని.. రేవంత్ రెడ్డికి షర్మిల రాజకీయ పార్టీపై కడుపు మంట అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది కడుపు మంట షర్మిలది గుండె తడి అని వ్యాఖ్యానించారు. ఆయన తెలంగాణను అస్థిరపరచడానికి రేవంత్ ప్రయత్నం చేశారని ఆరోపించారు.
షర్మిల పార్టీ ఓ సంచలనం…
తెలంగాణ సమాజంలో షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన ఓ సంచలనంగా ఆమె అనుచరుడు అభివర్ణించారు. ఎవరు డబ్బు తీసుకుని పని చేస్తున్నారో ప్రజలందరూ చూశారని ఎద్దేవా చేసిన ఆయన.. షర్మిల పార్టీ ప్రకటన చేయకముందే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ కాపీ కొడుతుందని విమర్శించిన దేవేందర్ రెడ్డి.. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా.. కాంగ్రెస్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. పీసీసీ పీఠం జారిపోతుందనే కడుపు మంటలో రేవంత్ రెడ్డి ఉన్నారని వైఎస్సార్ పేరు ఎత్తకపోతే పీసీసీ పీఠం దక్కదని భావిస్తున్నారని అన్నారు. ఫోర్ కార్నర్ పోటీ కోసమే షర్మిలమ్మ పార్టీ పెడుతున్నారని రేవంత్ అంటున్నారు, త్రి కార్నర్ పోటీలోనే కాంగ్రెస్ ఓడిపోయింది షర్మిలమ్మ పార్టీ పెట్టడం రేవంత్ రెడ్డికి కడుపు మంటగా మారిందని అన్నారు.