YS Sharmila Party : తెలంగాణలో ప్రస్తుతం రాజన్న రాజ్యం లేదు – ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువస్తా అని దివంగత సీఎం వైఎస్ఆర్ తనయ షర్మిల స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లో నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తరువాత అన్ని జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలను నిర్వహిస్తానని తెలిపారు. అభిమానుల సూచనలు, సలహాలు తీసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా నల్లగొండ జిల్లా ప్రజలకు గ్రౌండ్ రియాలిటీ బాగా తెలుస్తుందని అందుకే ముందుగా ఆ జిల్లా వారిని రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని అన్నారు. పార్టీ పేరు విషయంపై మీడియా ప్రస్తావించగా తరువాత చెబుతానంటూ సమాధానం దాటవేశారు. అయితే షర్మిల ప్రారంభించే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రచారం జరుగుతోంది.
షర్మిల సమావేశానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు హజరయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు పై ప్రజానీకానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు లేదు, రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు అని పేర్కొంటూ తాను రాజన్న రాజ్యం తీసుకువస్తానని షర్మిల చెప్పడంతో షర్మిల పార్టీ ఖాయమని స్పష్టం అవుతోంది. షర్మిల ప్రకటన వైఎస్ఆర్ అభిమానులను నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్ఆర్ అభిమానులు కొందరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా మరి కొందరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. షర్మిల రాజకీయ అరంగ్రేటం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలాన్ని కల్గిస్తోందని అంటున్నారు.