YS Sharmila : తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడం తన అన్న ఏపి సీఎం వైఎస్ జగన్కు ఇష్టం లేదని అన్నారు. జగన్ తో తనకు పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని అన్నారు. తనకు వైసీపీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్ నే అడిగి తెలుసుకోవాలని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ను ఎదిరించడానికి కూడా తాను సిద్ధమేనని షర్మిల స్పష్టం చేశారు.
YS Sharmila : స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
షర్మిల పార్టీ పెట్టనున్నారు అన్న ప్రచారం జరిగిన నాటి నుండి ప్రతిపక్షాలు ఆమె స్థానికతపై విమర్శలు చేస్తున్నాయి. దీనిపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లలనూ కన్నాను, ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే అని అంటూ సీఎం కెసిఆర్, బీజెపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు అని షర్మిల ప్రశ్నించారు. హైదరాబాదుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందనీ, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. దివంగత సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసం నుండే పార్టీ ప్రస్థానం ప్రారంభిస్తానని షర్మిల పేర్కొన్నారు.
టిఆర్ఎస్, బీజేపీపై సెటైర్ లు
తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉద్యమం అంటూ ఒకరు, మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్, బీజెపీలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. అతి త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించిన షర్మిల.. సీఎం కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కన్నా ఉద్యోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. కరోనా రోగుల నుండి ప్రైవేటు ఆసుపత్రులు లక్షలు వసూలు చేసినా అసుపత్రుల దోపిడీపై సీఎం దృష్టి పెట్టలేదని విమర్శించారు.
త్వరలో పాదయాత్ర
రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు షర్మిల తెలిపారు. పోలవరం నుండి పోతిరెడ్డిపాడు వరకూ తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీపై భర్త అనిల్ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయన్న షర్మిల..తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఉన్నట్లు తెలిపారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు.