YS Jagan : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల..ఆ మరుసటి రోజు పార్టీ నిర్మాణం, పార్టీ కార్యాచరణ, సమ్మేళనాలు నిర్వహణపై ముఖ్య నాయకులతో చర్చించారు. ఇలా దూకుడు మీదున్న ఈ మహిళా నేత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
YS Jagan షర్మిల ఏం చేస్తున్నారు?
షర్మిల పార్టీపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అవి ఏవీ పట్టించుకోకుండా.. వరుస సమావేశాల నిర్వహణకే షర్మిల మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలంగాణలో రాజన్న రాజ్యం మంత్రం జపిస్తున్న షర్మిల వైఎస్ఆర్సీపీ ఆఫీసు ఉన్న లోటస్ పాండ్లో కాకుండా హైదరాబాద్ లో పార్టీకి కొత్తగా కార్యాలయం చూడాలని నేతలకు షర్మిల సూచించినట్టుగా చెబుతున్నారు. దీంతో షర్మిల ఆఫీసు మరో చోట ఏర్పాటు కానుండటం ఖాయమని అంటున్నారు.
చేరికల గురించి ఇప్పుడెందుకు?
మరోవైపు పార్టీలో చేరికలపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా.. పూర్తిస్థాయి పరిశీలన జరిగిన తర్వాతే ఆహ్వానించాలనే అభిప్రాయాలు నేతల వ్యక్తం అయినట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ కాబట్టి.. కొత్త వారికి అవకాశం ఇచ్చేలా చూడాలని షర్మిల నేతలకు సూచించినట్టుగా సమాచారం. మొత్తంగా షర్మిల పొలిటికల్ రీ ఎంట్రీ తెలంగాణలో పక్కా ప్లానింగ్ ప్రకారమే ఉండనున్నట్లు చెప్తున్నారు.