YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టకముందే బెంగళూర్ లో స్విచ్ వేస్తే తెలంగాణలో పెద్ద ప్రభంజనం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. షర్మిలే స్వయంగా పత్రికా ప్రకటన విడుదల చేయడంతో నిజం కాదేమో అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా మూడు రోజుల క్రితం షర్మిల లోటస్ పాండ్ వేదికగా వైఎస్ఆర్ అబిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలన వార్త అయ్యింది.
YS Sharmila : అర్థాంతరంగా బెంగళూరు పయనంపై ఆసక్తికర చర్చ
ముందుగా నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించిన షర్మిల ఆ మరుసటి రోజే పార్టీ ఏర్పాటు పై ముఖ్య నేతలతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 21వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. ఖమ్మం జిల్లా ప్రతినిధులతో సమావేశం అయిన తరువాత భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయిన మూడు రోజుల్లోనే షర్మిల బెంగళూరుకు పయనమై వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం ఆమె సోదరుడు, ఏపి సీఎం జగన్ కు ఇష్టం లేదని, పార్టీ ఏర్పాటు ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఏపి ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే మీడియా సమావేశంలో చెప్పారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సన్నిహత సంబంధాలు కొనసాగించేందుకే వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. షర్మిల హైదరాబాదులో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన తరువాత తాడేపల్లి నుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోటస్ పాండ్ కు వెళ్లి ముందుగా షర్మిల, ఆ తరువాత ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో సుదీర్ఘంగా మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్ కే కలిసి వచ్చిన తరువాతే ఆమె అర్థాంతరంగా బెంగళూరుకు పయనమై వెళ్లడంతో జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల వ్యక్తిగత పర్యటన అని షర్మిల సన్నిహితులు చెబుతున్నా వివరాలు మాత్రం వెల్లడించలేదు. షర్మిలతో సోదరుడు జగన్ ఇటు విజయవాడ లోగానీ అటు హైదరాబాదులో గానీ భేటీ అయితే ప్రముఖంగా వార్తల్లో నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో బెంగళూరును వేదికగా ఎంపిక చేసుకున్నారని టాక్.
షర్మిల బ్యాగ్ బోన్ ఎవరు?
ఇది ఇలా ఉంటే షర్మిల రాజకీయ పార్టీ పై తెలంగాణలో అనేక రకాల ఊహగానాలు సాగుతున్నాయి. తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పిన షర్మిల పార్టీ పెడుతున్నట్లుగా కానీ, పార్టీ పేరు గానీ స్పష్టంగా వెల్లడించలేదు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు. ముందుగా గ్రామీణ స్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వైఎస్ఆర్ అభిమానుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. అయితే షర్మిలకు గాడ్ ఫాదర్ ఎవరు, ఎవరి ఆశీస్సులతో పార్టీ పెట్టనున్నారు అనే దానిపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పార్టీకి జగన్ మద్దతు ఉందని కొందరు కాదు, కెసిఆర్ ఉన్నారని మరి కొందరు వీరు ఇద్దరు కాదు బీజెపీ అని మరి కొందరు చెబుతూ దానికి సంబంధించిన లెక్కలు చెబుతున్నారు. అయితే వీటిలో ఏది నిజమో, ఏది అబద్దమో మరి కొద్ది రోజుల్లో తేలనున్నది. తెలంగాణలో ఓ కొత్త పార్టీ వచ్చేంత రాజకీయ సూన్యత అయితే లేదని కొందరు అంటున్నారు. అయితే షర్మిల రాజకీయ పార్టీ పెడితే మాత్రం దాని ప్రభావం అదికార ప్రతిపక్ష పార్టీలపై ఉంటుందని కశ్చితంగా చెబుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం మాత్రం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో షర్మిల రాజకీయ పార్టీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపుగా ఎవరి ఊహలతో వారు కాలక్షేపం చేయక తప్పదు.