YS Sharmila: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయ ఘట్టంలో ఎంట్రీకి పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడిన షర్మిల.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో వైఎస్ షర్మిల చెప్పారో లేదో అది అమలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆమె అనుచరులు.
తగ్గేదే లేదంటున్న షర్మిల
తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఆమె అనుచరులు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర షర్మిల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. దీక్ష చేసినప్పటికీ సర్కారు స్పందించకుంటే ఇతర జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచరులు చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుందనే ఆసక్తి నెలకొంది.
సెంటిమెంటును టచ్ చేస్తున్న షర్మిల
ఖమ్మం సభలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి ఇంటికి ఉద్యోగమన్న మాట ఏమైంది కేసీఆర్ సారూ. నిరుద్యోగ భృతి సంగతేంటి సారూ. ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఉద్యోగం వస్తుందని జనం అనుకుంటున్నరు. కొత్త రేషన్ కార్డు లేదు. కొత్త పింఛన్లు లేవు. కార్పొరేషన్ లోన్లు లేవు. దళితులకు మూడెకరాల భూమి లేదు. బడుగు, బలహీన వర్గాల గురించిన ధ్యాసే లేదు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది?” అని షర్మిల ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేర్ల మీద రూ. వేలు. రూ. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకుంటూ పాలకులు జేబులు నింపుకుంటున్నారని, అందుకే ప్రజల తరఫున పాలకులను ప్రశ్నించేటందుకే కొత్త పార్టీ పెడ్తున్నట్లు ప్రకటించారు.