YS Sunitha reddy: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కీలకమైన నాయకులు, ప్రముఖులను అరెస్టు చేయడానికి సీబీఐ అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది. ముందుగా సమాచారాన్ని సేకరించింది. దానికి అనుగుణంగా ఆధారాలు సేకరిస్తోంది, నిర్ధారించుకునే పనిలో ఉంది. త్వరలో చార్జిషీటు ధాఖలుకు సన్నద్దం అవుతోంది. మొత్తానికి ఈ కేసులో సూత్రధారులుగానో, పాత్రధారులుగానో ఉన్న ఇద్దరు ముగ్గురుని అరెస్టు చేయడానికి ముందడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించి సీబీఐకి కొంత ప్రాధమిక అధారాలు లభ్యమైయ్యాయి. ఈ కేసులో ముందుగా వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేయడంతో పాటు ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేస్తున్నారు. వివేకా పిఏ, డ్రైవర్, నైట్ వాచ్ మెన్, పని మనిషి, కంప్యూటర్ ఆపరేటర్ తదితరులను సీబీఐ విచారించింది. సీబీఐకి అందిన ప్రాధమిక విచారణలో కడప ఎంపి అవినాష్ రెడ్డిపై కొంత ఫోకస్ వెళ్లగా ముందుగా ఆయన పీఏలను పిలిచి విచారణ జరిపారు. త్వరలో ఆయనను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఈ కేసులో మొదటి నుండి ఎవరిమీద అనుమానాలు ఉన్నాయో, కడప, పులివెందులలో ఎవరిమీద అయితే ఎక్కువగా చర్చ జరుగుతుందో సీబీఐ అక్కడికి చేరుకుంది. వాళ్లు పెద్దవాళ్లు కావడం వల్ల వాళ్లు తప్పించుకోకుండా, తప్పించుకునే అవకాశం లేకుండా చేరుకుంది. అయితే ఈ దశలోనే వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి అనూహ్యంగా చేసిన పలు ఆరోపణలు సంచలనంగా మారాయి. నిన్న ఆమె కడప ఎస్పీని కలిసి తమకు ప్రాణ భయం ఉందనీ, తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయనీ, కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారనీ, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ఇదే తరహా ఆరోపణలు గత నెలలో కూడా ఆమె చేసి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అప్పటి ఫిర్యాదు మేరకు ఎస్పీ భద్రత కల్పించినా అది సరిపోదని పెంచాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కేసు ఇంత వేగంగా వెళ్లడానికి కారణం సునీతా రెడ్డి. రాజకీయ ఒత్తిడిలు ఇతరత్రా కారణాలతో సీబీఐ ఈ కేసును నిర్లక్ష్యం చేసినా సునీతారెడ్డి మొదటి నుండి పట్టుదల మీద ఉండి దర్యాప్తు వేగవంతం అయ్యేందుకు డిల్లీ స్థాయికి వెళుతున్నారు. ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. సీబీఐ ఉన్నతాధికారులను కలుస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారు సునీతారెడ్డి.
ఇక్కడ రాజకీయ వత్తిడులకు లొంగి తప్పించుకునే అవకాశం లేకుండా కూడా చేస్తున్నది సునీతారెడ్డి. ఇప్పుడు సునీతా రెడ్డి లేకపోతే ఈ కేసును నీరుగార్చేయవచ్చు అనేది బహుశా ఆ హంతకుల ప్లాన్ కావచ్చు. అందుకే సునీతారెడ్డి పై నిఘా పెట్టారు. రెక్కీ నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి వివేకానంద రెడ్డి కుటుంబాన్ని లేకుండా చేయాలన్నది వాళ్ల ప్లాన్ అయితే జగన్మోహనరెడ్డి గారు ఏమి చేస్తున్నట్లు. వాళ్ల కుటుంబమే కదా. సొంత బాబాయే కదా. దీని మీద బాధ్యత కశ్చితంగా సీఎం జగన్ పైనా ఉంటుంది. ఆయన వెంటనే స్పందించి మా చెల్లెలు ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటి, మా బాబాయ్ కుటుంబానికి బెదిరింపులు రావడం ఏమిటి అన్నదానిపై స్పందించి అక్కడ పోలీసు బలగాలను దింపి అక్కడ అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులు ఎవరు, వాళ్లను పిలిచి విచారించండి అని ఆదేశాలు ఇవ్వాలి. కానీ ఇంత వరకూ ఆ స్థాయిలో జగన్ రెస్పాండ్ అవ్వలేదు. ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో చూడాలి. ఒక వేళ సునీతా రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమే అయిత ఈ విషయంలో పోలీసులే కాదు ప్రభుత్వమే ఫెయిల్ అయినట్లు. ఈ మచ్చ, మరక అన్నీ జగన్మోహనరెడ్డి మీదకే వెళతాయి. ఎందుకంటే సీఎం జగన్ బాబాయ్ హత్య కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే దశలో బాబాయ్ వివేకా కుటుంబానికి ప్రాణ హని అంటూ వార్తలు రావడం, బెదిరింపులు వస్తున్నాయి అంటే ఆయన సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. తన చేతుల్లో ఉన్న అధికారులతో అక్కడి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సునీతారెడ్డి కుటుంబానికి రక్షణ పెంచాల్సిన అవసరం ఉంది.