YS Vijayamma : గత మూడు రోజులుగా చంద్రబాబు అనుకూల మీడియాలో తమ కుటుంబంపై అసత్య కథనాలు, వ్యాఖ్యలు, విమర్శలు రాస్తున్నారంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతి రాధాకృష్ణ రాతలు చూస్తే ఆయన చేసేది జర్నలిజమేనా అని అనుమానం కలుగుతుందన్నారు. నిజాలను పక్కదారి పట్టించేలా కుటుంబంలో చిచ్చు పెట్టేలా రాధాకృష్ణ కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పుడు రాతలతో కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ కుటుంబంపై అసత్య కథనాలు, వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరువాత డాక్టర్ వైఎస్ఆర్ సతీమణిగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు విజయమ్మ.
ప్రజల్లో చంద్రబాబు బలాన్ని పెంచలేమని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడల్లా మా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ, టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి – ఏబిఎన్, టీవి 5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్నాయనేది జగమెరిగిన సత్యమని అన్నారు. గత ఏడేళ్లుగా పవన్ కల్యాణ్ కూడా వారి బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్ చేయడం కూడ అందరికీ తెలిసిందేనన్నారు. ఆ పార్టీలు, వ్యక్తులు ఒకే మాట, ఒకే బాటగా అబద్దాలు చెప్పడం ప్రారంభించారన్నారు. వారు చెప్పిన అసత్యాలు ప్రజలు ఏనాడూ పరిగణలోకి తీసుకోలేదన్నారు. అందుకే ఆనాడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
మరిది గారు, వైఎస్ వివేకానంద రెడ్డి ని ఎవరు హత్య చేశారు అన్నది కఛ్చితంగా నిగ్గు తేల్చాల్సిందేననీ ఇది తమ కుటుంబంలోని అందరి మాట అని, దీనిలో ఎవరికీ బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హత్య జరిగింది, ఆ తరువాత రెండున్నర నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయరెడ్డి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండగా ఆయనను తిరుపతిలో స్టేజీ మీద పెట్టుకుని పవన్ కల్యాణ్ దర్యాప్తు సీబీఐ చేతిలో అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్ మీద విమర్శలు చేశారన్నారు.
డాక్టర్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలంటూ రాధాకృష్ణ ఇష్టానుసారంగా రాశారు. తమ కుటుంబంలో విబేధాలు ఉన్నట్లుగా, వివేకా మీద చేయి చేసుకున్నాడనీ, తాను మానసికంగా కుంగిపోతున్నానంటూ ఇలా ఎన్నో అసత్యాలు తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. పరిపాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారన్నారు. మహానేతకు భార్యగా, ఏపి ముఖ్యమంత్రి తల్లిగా ఉన్న నేడు గర్వపడతానా లేక కుంగిపోతానా అని ప్రశ్నించారు. షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మిందన్నారు. తెలంగాణలో అవకాశం అన్నకు కాకుండా దేవుడు తనకే ఇచ్చాడని షర్మిలమ్మ భావిస్తూ ముందడుగు వేస్తోందన్నారు. పిచ్చి రాతలతో నా బిడ్డల మధ్య విబేధాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్నారు. అది ఏనాటికీ జరగని పని విజయమ్మ స్పష్టం చేశారు.