వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తనయుడు వైఎస్ జగన్తో కలిసి ప్లీనరీకి విచ్చేసిన విజయమ్మ సమావేశంలో మాట్లాడుతూ తన ప్రసంగం చివరలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని వెల్లడించారు విజయమ్మ. తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అన్నారు. వైఎస్ఆర్ లేని లోటు తనకు ఎవరూ తీర్చలేరన్నారు. అందరినీ ఆశీర్వదించడానికి తాను ఇక్కడకు వచ్చానన్నారు. అందరి హృదయాల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా నిలిచి ఉన్నారని అన్నారు. ఏపిలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. జగన్ మాస్ లీడర్ అని అన్నారు.
మూడేళ్ల కాలంలో మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని చెప్పారు. జగన్ చెప్పినవీ చెప్పనవి కూడా చేసి చూపించారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. తండ్రి ఆశయాలను జగన్ తప్పక నెరవేరుస్తారని విజయమ్మ అన్నారు. ప్రజల అభిమానం నుండి వైసీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు పక్కన పెట్టారని విమర్శించారు. చంద్రబాబు జనం నుండి వచ్చిన నేత కాదని అన్నారు విజయమ్మ. జగన్ అనేక కష్టాలు ఎదుర్కొని జనం నుండి వచ్చారన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కల్గిన నేత జగన్ ఒక్కడేనన్నారు. గతంలో మాదిరిగా తన బిడ్డ జగన్ ను మరో సారి ఆశీర్వదించాలని కోరారు విజయమ్మ.
తెలంగాణలో పార్టీ పెట్టిన తన కుమార్తె షర్మిలకు తను అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెండు చోట్ల సభ్యత్వం ఉండొచ్చా అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. తను రాయని లేఖతో చేయని సంతకంతో వైసీపీకి రాజీనామా చేసినట్లుగా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారనీ, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విమర్శలకు తావు లేకుండా ఉండటం కోసం తాను వైసీపీ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. అక్కడ షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆమెకు అండగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన ఉనికి ఎవరికీ అభ్యంతరం కాకుండా ఉండేందుకు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇటు జగన్, అటు షర్మిల ఇద్దరూ రాణించాలి, బాగుండాలి అని తల్లిగా కొరుకుంటానని అన్నారు. జగన్ తిరుగులేని మెజార్టీతో మరో సారి ముఖ్యమంత్రిగా గెలుస్తారని నమ్మకం ఉందని అన్నారు.