YS Viveka Case: ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు వెలుగులోకి రావడంతో వైసీపీ అలర్ట్ అయి సీబీఐపైనే ఆరోపణలు చేసింది. ఈ కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరడంతో వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వ్యాంగ్మూలంలో ప్రముఖుల పేర్లు ప్రస్తావించడంతో చార్జీషీటులోనూ సదరు ప్రముఖుల పేర్లు పేర్కొనడంతో టీడీపీ విమర్శల దాడి పెంచింది. ఎంపి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అన్నందుకే వివేకాపై కక్షగట్టారని చంద్రబాబు ఆరోపించారు. హత్య చేయించిన వ్యక్తులను వెనుకేసుకుని రావడం దుర్మార్ఘమన్నారు. సిీబీఐ దర్యాప్తునే తప్పుబడుతున్నారని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి పరిటాల రవి హంతకులను ఒకొక్కరిని చంపేశారని తెలిపారు. టీడీపీ సర్పంచ్ ల అవగాహన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. హత్యా రాజకీయాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
YS Viveka Case: ఆరోపణలకు ఆధారాలు ఉండాలి
చంద్రబాబు కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వివేకా హత్య వ్యవహారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సజ్జల తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. జగన్ పై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసినప్పుడే సీబీఐ అంటే తమకు అర్ధం అయ్యిందన్నారు. అయినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థను గౌరవిస్తామన్నారు సజ్జల. సీబీఐ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని సజ్జల అన్నారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనపై నాడు రాజశేఖరరెడ్డి ఉదారంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు సజ్జల. రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలని హితవు పలికారు సజ్జల. గుండెపోటు అన్నంత మాత్రన అది దర్యాప్తును ప్రభావితం చేసినట్లు అవుతుందా అని సజ్జల ప్రశ్నించారు. కనిపించే సాక్షాధారాలను దర్యాప్తు అధికారులు పరిశీలనలోకి తీసుకుంటారు కదా అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మెరుగైన దర్యాప్తు చేస్తారేమో
సాక్షాధారాలను ఎవరు తారుమారు చేస్తారని సజ్జల ప్రశ్నించారు. బహుశా సీబీఐ కంటే చంద్రబాబు మెరుగైన దర్యాప్తు చేస్తారేమో అని సజ్జల ఎద్దేవా చేశారు. ఎదుటివారిపై సెటైర్లు వేసే క్రమంలో చంద్రబాబు తానే అపహాస్యం పాలవుతున్నారని సజ్జల విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం అన్నది తమ పార్టీకి పెద్ద దెబ్బ అనీ, జగన్ పెద్ద అండను కోల్పోయారని సజ్జల అన్నారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.