YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రదారులు (నేరం చేసిన వారుగా భావిస్తున్న) ఎవరు అనేది తెలుసుకుంది. ఆ పాత్రదారులలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, యాదటి సునీల్ కుమార్ యాదవ్, గజ్జల ఉమా శంకరరెడ్డి, షేక్ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఈ నేరంలో పాలుపంచుకున్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి న్యాయమూర్తి సమక్షంలో వ్యాంగ్మూలం ఇవ్వడంతో ఆయనకు క్షమాబిక్ష ప్రకటించి అతన్ని ఈ కేసులో సాక్షిగా పేర్కొంది సీబీఐ.
శివశంకర్ రెడ్డి అరెస్టుతో…
అప్రూవర్ గా దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ కాపీలను కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరపున న్యాయవాదులకు గతంలోనే అందజేశారు. అప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వెలువడ్డాయి. రూ.40 కోట్ల డీల్ తో వివేకా హత్య జరిగిందనీ, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది దస్తగిరి ఆ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించడంతో దీని వెనుక ఆయన ప్రమేయం కూడా ఉందని అనుమానాలు వస్తున్నాయి. సీబీఐ కూడా వివేకా హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తును కొనసాగిస్తోంది.
YS Viveka Case: కుట్రదారుల పాత్రపై ఆధారాల సేకరణలో
అయితే సీబీఐ గతంలో పులివెందుల కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ లోని వివరాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో వైసీపీ వ్యతిరేక మీడియాలో కొత్తగా వెలుగులోకి వచ్చినట్లుగా ఈ అంశాలను హైలెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు నిందితులు వెనుక ఉన్న కొందరు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడం లాంటి చర్యలు చేపట్టినా సీబీఐ మాత్రం కుట్రదారుల పాత్రపై ఆధారాల సేకరణలో నిమగ్నమై దర్యాప్తును కొనసాగిస్తోంది. వివేకా హత్య కేసులో 40 కోట్ల డీల్, ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపివేయడం, దాని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాలు అన్నీ గతంలోనే మీడియాలో వచ్చాయి. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా సీబీఐ చార్జిషీటు అంటూ నేడు పాత కథనాలనే కొత్తగా హైలెట్ చేయడం గమనార్హం.