YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వేళ 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హజరు కానున్నారు. నేటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల అవినాష్ రెడ్డి అరెస్టు నుండి రక్షణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ విచారణకు హజరు అవుతారా లేదా .. సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా అనే దానిది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు మార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఈ నెల 16వ తేదీన విచారణ కు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు హజరు కాలేననీ, తనకు మూడు నాలుగు రోజులు సమయం ఇవ్వాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ 19వ తేదీన విచారణకు హజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సీబీఐని సమయం కోరిన అవినాష్ రెడ్డి ఆ మరుసటి రోజే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించాలని అవినాష్ రెడ్డి పిటిషన్ లో కోరారు. సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని దర్మాసనం ముందు బెయిల్ పిటిషన్ ను అవినాష్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. విచారణ అత్యవసరం అయితే రాతపూర్వకంగా అభ్యర్ధన ఇవ్వాలని, అత్యవసరాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం కోర్టు నుండి ఎటువంటి ఆదేశాలు రాని క్రమంలో అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ అధికారుల ముందు హజరు అవుతారా.. లేదా అన్న దానిపై సస్పెన్స్ ను తెరదించుతూ అవినాష్ రెడ్డి తన నివాసం నుండి సీబీఐ కార్యాలయంకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. విచారణకు హజరయ్యే ముందుగా న్యాయనిపుణులతో అవినాష్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తొంది. మరో పక్క కోటి లోని సీబీఐ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు సీబీఐ కార్యాలయం వద్దకు రాగా వారి నెవరినీ లోపలకు అనుమతించలేదు. అవినాష్ రెడ్డి, ఆయన తరపు న్యాయవాదులను మాత్రమే లోపలకు అనుమతించేందుకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో పక్క అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు విచారణలో ఉంది. ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా లేదా అనేదే తేలాలంటే సాయంత్రం వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.