YS Viveka Murdar case : దివంగత ఏపి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని 2019 ఎన్నికలకు ముందు మార్చి 15వ తేదీన ఆయన నివాసంలోనే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నాటి చంద్రబాబు ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది. ఆ సమయంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తునకు చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి మరో సిట్ ఏర్పాటు చేశారు.
నెలలు గడుస్తున్నా వివేకా హత్య కేసులో అసలైన దోషులను గుర్తించడంలో సిట్ విఫలమైంది. వందలాది మందిని విచారించినా అసలైన దోషులను అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని పిటిషన్ లో కోరారు. హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపి కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది దాటుతున్నా ఇంత వరకూ అసలైన దోషులను గుర్తించలేదు. సాక్షాలను మాయం చేశారన్న అభియోగంపై ముగ్గురిని మాత్రం అరెస్టు చేశారు. వారిని జైలుకు తరలించగా తరువాత బెయిల్ పై విడుదల అయ్యారు. హైకోర్టుకు, సీబీఐకి డాక్టర్ సునీత పలువురి అనుమానితుల పేర్లు గతంలోనే ఇచ్చారు. అయినా వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రగతిపై ఇంత వరకూ సీబీఐ ఒక్క ముక్క కూడా బహిరంగంగా వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో సునీత రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇంతకు ముందే సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, దర్యాప్తు పక్కదారి పడుతోందని కూడా ఆరోపించారు. ప్రస్తుత మీడియా సమావేశంలో ఆమె ఈ వివేకా హత్య కేసులో ఏమి మాట్లాడబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది.