మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గజ్జల ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం అతను జైలులో ఉన్నారు. అయితే ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి సంచలన ఆరోపణలు చేస్తూ పరమేశ్వరరెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరమేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరమేశ్వరరెడ్డి తనపై ఇష్టమొచ్చిన రీతిలో అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తరహాలోనే తన భర్తను హత్య చేస్తానని బెదిరింపులకు దిగారని స్వాతి తెలిపింది.
తనపై దాడి చేస్తున్న సమయంలో తప్పించుకుని మరో గదిలో దాక్కునట్లుగా ఆమె మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు వారు పరమేశ్వరరెడ్డిని పంపించేశారని స్వాతి తెలిపారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే పరమేశ్వరరెడ్డి బాధ్యత వహించాలన్నారు. జైలు నుండి తన భర్త బయటకు రాగానే చంపుతామని పరమేశ్వరరెడ్డి బెదిరించారని చెప్పారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచి ఎంపీ అవినాష్ రెడ్డికి మూడో సారి విచారణ కు రావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం కడప రాజకీయ ఇది వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సిట్ అధికారులు పరమేశ్వరరెడ్డిని అనుమానితుడుగా విచారణ చేశారు.