YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలన కేసుగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో పురోగతి కనబడుతోంది. గతంలో రెండు మూడు పర్యాయాలు కడపకు వచ్చిన సీబీఐ అధికారుల బృందం పది పదేహేను రోజులు విచారణ చేసి వెళ్లిపోయింది అయితే నాల్గవ పర్యాయం రంగంలోకి దిగిన సీబీఐ బృందం మూడు నెలలకు పైగా కడప, పులివెందులలో తిష్టవేసి వందలాది మంది అనుమానితులు, సాక్షులను విచారిస్తూ కీలక అధారాలను సేకరించింది. ఈ క్రమంలోనే ఇంతకు ముందే వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబీఐ.. మరో కీలక అనుమానితుడు ఉమాశంకర్ రెడ్డిని అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో ఈ ఇద్దరి పాత్ర ఉన్నట్లు సీీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది. వారు ఉపయోగించిన వాహనాన్ని, ఆయుధాలను, ఘటన జరిగిన రోజు ఉమాశంకర్ వేసుకున్న దుస్తుల (రక్తపు మరకలు ఉన్న)ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
తాజాగా సీబీఐ అరెస్టు చేసిన ఉమాశంకర్ రెడ్డి వివేకా పీఏ జగదీశ్వరరెడ్డి సోదరుడు. వివేకా హత్య జరిగిన ఒక రోజు ముందు అక్కడ ఉన్న కుక్కను ఉమాశంకర్, సునీల్ కుమార్ యావద్ కలిసి కారుతో ఢీకొట్టి చంపేశారు. ఈ విషయం సీబీఐ అధికారుల దర్యాప్తులో కొనుగొన్నారు. హత్య జరిగిన రోజు ఉమాశంకర్ బైక్ లో గొడ్డలి పెట్టుకుని పరారైయ్యాడు. ఆ గొడ్డలిని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమాశంకర్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ ఈ కీలక విషయాలను వెల్లడించింది. ప్రధానంగా వివేకా హత్య కేసులో వీరి ఇద్దరి ప్రమేయం ప్రాధమికంగా ఉందని దృవీకరణకు వచ్చిన సీబీఐ..వివేకాను హత్య చేయాల్సిన అవసరం వీరికి ఎందుకు ఉంటుంది ? వీరి వెనుక ఉన్న పెద్దలు ఎవరు ? అసలు సూత్రధారులు ఎవరు ? అనేది తేల్చడంతో పాటు అందుకు సంబంధించిన సాక్షాలు, అధారాలు సేకరించే పనిలో ఉంది. ఇది గనుక జరిగితే కేసు క్లోజ్ అయినట్లే. అయితే ఈ కేసులో కీలక సమాచారం కూడా సీీబీఐ వద్దకు రావాల్సి ఉంది.
అయితే వివేక వంటిపై రక్తపు గాయాలు చూసి, హత్య జరిగిందని తెలిసి కూడా బయటకు వచ్చి ఏమి తెలియనట్లు గుండె పోటుతో మరణించారు అని ఒక ఎంపి చెప్పడం మీడియాలో అందరూ చూశారు. దీంతో ఈ విషయంలో ఆయన కీలక సాక్షి అయితే సీబీఐ ఆయనను ఎందుకు విచారణకు పిలవలేదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ విషయంలో సీబీఐ ఆ ప్రధాన సాక్షిని విచారణ చేసిన రోజున కేసు క్లోజ్ అయినట్లే అవుతుందని భావిస్తున్నారు. అదే విధంగా కడపకు చెందిన ఓ ప్రజా ప్రతినిధిపైనా కీలక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పీఏలను గత నెలలో సీబీఐ పిలిపించి విచారణ చేసింది. ఆయన పాత్ర ఏమిటి అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. వైఎస్ సునీతా రెడ్డి ఇచ్చిన అనుమానిత జాబితాలోనూ ఎంవి వైఎస్ అవినాష్ రెడ్డి పేరుతో పాటు వైఎస్ భాస్కరరెడ్డి, బీజేపీి నేత ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి పేర్లు ఉన్నాయి. కానీ వీళ్లెవరినీ సీబీఐ ఇంకా విచారించలేదు. వీళ్లందరినీ విచారిస్తే కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే అవుతుంది. కానీ పెద్ద వాళ్లను సీబీఐ విచారించాలంటే కొంత ప్రాధమిక సమాచారం, కొన్ని సాక్షాలు, ఆధారాలు ఉండాలి. ప్రస్తుతం సీబీఐ ఆ పనిలో ఉన్నట్లు కనబడుతోంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.