YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎన్ని మలుపులు తిరుగుతోంది. ఎన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయి అనేది అందరికీ తెలిసిందే. వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి హస్తం ఉందని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇటు వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ వాళ్లు వారి స్ట్రాటజీ ప్రకారం అవినాష్ రెడ్డి పాత్రలేదు. టీడీపీ వాళ్ల పాత్రే ఉంది, బీటెక్ రవి, ఆదినారాయణల పాత్రే ఉందని వీళ్లు ప్రచారం చేస్తున్నారు. వీటిలో ఏవి నిజాలు, ఏవి వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. సీబీఐ అనుమానాలు ఎవరిపై ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ కేసులో ఓ పెద్ద ట్విస్ట్, పెద్ద టర్నింగ్ పాయింట్ నిన్న హైకోర్టు తీర్పు రూపంలో బయటకు వచ్చింది.
YS Viveka: అవినాష్ రెడ్డిపై అనుమానాలు..?
మొదటి నుండి ఈ కేసులో ఎంపి అవినాష్ రెడ్డిపై అనుమానాలు బలంగా వినబడుతున్నాయి. ఆయనను సీబీఐ విచారణకు పిలిపించడానికి, అవసరమైతే అరెస్టు చేయడానికైనా సరే సీబీఐ కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉంది. నిన్న హైకోర్టు నుండి వచ్చిన తీర్పు ఈ కేసులో అత్యంత కీలకమైంది. వైఎస్ వివేకా హత్య కేసులో నాల్గవ నిందితుడు, మృతుడి మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారడానికి అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. దస్తగిరి అప్రూవర్ గా మారడానికి కడప కోర్టు న్యాయమూర్తి అనుమతించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సీబీఐ దుర్దేశంతో వ్యవహరిస్తుందన్న పిటిషనర్ ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నిందితుల నేర నిరూపణకు ప్రత్యక్ష సాక్షం కావాలన్న ఉద్దేశంతో దస్తగిరిని అప్రూవర్ గా మారేందుకు అనుమతించాలని కడప కోర్టును సీబీఐ అభ్యర్ధించిందనీ తెలిపింది. సరైన సాక్షాలు లేనందున నేరస్తులు తప్పించుకోకుండా ఉండేందుకే సీబీఐ అలా వ్యవహరించింది. దస్తగిరి అప్రూవర్ గా మారవచ్చు, ఎటువంటి అభ్యంతరాలు లేవని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
దస్తగిరి వ్యాంగ్మూలం కీలకం
దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరో మారు న్యాయమూర్తి సమక్షంలో ఆయన వ్యాంగ్మూలం ఇప్పేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష పాల్గొన్న నిందితులను అరెస్టు చేసిన సీబీఐ కుట్రదారులను సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దస్తగిరి న్యాయమూర్తి సమక్షంలో ఇచ్చే వ్యాంగ్మూలం కీలకం కానుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారా..? లేదా అనే దానిపై దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో దస్తగిరి న్యాయమూర్తి సమక్షంలో అవినాష్ రెడ్డి పేరు చెబితే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అలర్ట్ అయ్యింది. వైసీపీలో, ప్రభుత్వంలో పెద్దలు సైతం ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఎటువంటి ప్రమేయం లేదంటూ వాదనలు వినిపిస్తున్నారు. సీబీఐ విచారణపైనే వారు ఆనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హతుడు వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఉన్నత స్థాయి నుండి తీసుకువచ్చిన వత్తిడి నేపథ్యంలో సీబీఐ కూడా ఎక్కడా తప్పటడుగు వేయకుండా సరైనదారిలో ఒక అడుగు దూరంలో వెళుతుంది అని చెప్పవచ్చు.