YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దొంగ పోలీసు ఆట ఆడుతున్నట్లు కనబడుతోంది. ఈ హత్య కేసు పరిశోధనలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు బాగుందా? సక్రమంగా వెళుతుందా? దారి తప్పుతుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంతకు ముందే ఈ కేసులో నైట్ వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టులో వాగ్మూలం ఇప్పించింది. అలాగే నిన్న వివేకా వద్ద పని చేసిన మాజీ డ్రైవర్ దస్తగిరి ప్రసాద్ ను కూడా కోర్టుకు హజరుపర్చి వాగ్మూలం ఇప్పించారు. దాదాపు అయిదు గంటల పాటు ఇది జరిగింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా రెండవ వ్యక్తితో కోర్టులో వాగ్మూలం ఇప్పించారు.
ఇంతకు ముందే వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దాదాపు మూడు నెలలుగా సీబీఐ నాల్గవ దశ దర్యాప్తులో ఇప్పటికి 160 మందిని విచారించింది. అయితే 160 మందిలో సీబీఐ డైవర్ దస్తగిరి, నైట్ వాచ్ మెన్ రంగన్న, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, సునీల్ కుమార్ యాదవ్, పిఏ జగదీశ్వరరెడ్డి, ప్రసాద్ రెడ్డి ల చుట్టే సీబీఐ తిరిగింది. అంటే డ్రైవర్, వాచ్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలా దిగువ స్థాయి వాళ్ల చుట్టూనే సీబీఐ తిరుగుతోంది. అలానే కడప ఎంపి అవినాష్ రెడ్డి పీఏలను కూడా సీబీఐ విచారించింది. అదే విధంగా అవినాష్ రెడ్డి తండ్రి బాస్కరరెడ్డిని కూడా సీబీఐ ఒక రోజు విచారించింది. కానీ నైట్ వాచ్ మెన్ ని, ఇంటి పని మనిషిని, డ్రైవర్ ను, కార్యకర్తలను రోజుల తరబడి, నెలలు తరబడి పిలిపించి విచారించారు. ఎంపి పీఏలను మాత్రం రెండు రోజులు మాత్రమే విచారించారు. బాస్కరరెడ్డిని కూడా ఒక రోజే విచారించారు.
ఇంతకు సీబీఐ ఈ కేసులో ఏమి చేయబోతున్నది అనేది ఓ పెద్ద మిస్టరీగా ఉంది. అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ ఏమో తనను బలవంతంగా కేసులో ఇరికిస్తున్నారు, తనకు ఈ కేసుకు సంబంధం లేదు అంటూ గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవానికి ఏవరైనా అదే చెబుతారు అనుకోండి. అయితే సునీల్ కుమార్ యాదవ్ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. నన్ను ఇరికిస్తున్నారు అని. అతని కుటుంబం కూడా సీబీఐ మీద సంచలన ఆరోపణలు చేసింది. సీబీఐ దారి తప్పింది, పెద్దోళ్లను వదిలివేసి మా మీదకు వచ్చింది, మాకు ఏమి అవసరం ఆయనను చంపాల్సిన అవసరం, దీనిలో పెద్దపెద్దోళ్లు ఉన్నారు అని సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం చెబుతోంది. దిగువ స్థాయి వాళ్లను పట్టుకుంటుంటే పెద్దోళ్లను అదుపులోకి తీసుకోవడం కోసం ఎర వేస్తుందేమో అని భావిస్తూ వస్తున్నారు. పెద్ద పెద్దోళ్లను అరెస్టు చేసేందుకు గానూ ఈ చిన్న చిన్న వాళ్లను పట్టుకుని స్టేట్ మెంట్ లు రికార్డు చేయిస్తూ ఎర వేస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు.
వివేకానంద రెడ్డి చంపాల్సిన అవసరం ఈ చిన్న చిన్న వాళ్లకు అవసరం లేదు అన్నది అందరికీ తెలిసిందే. అది సీబీఐకీ కూడా తెలుసు. ఒక వేళ వీళ్లు చేశారు అంటే వీళ్ల వెనుక ఎవరో ఉండి చేయించి ఉంటారు. ఆ చేయించిన వాళ్లు ఎవరు అనేది సీబీఐ తేల్చాల్సి ఉంది. అయితే అది తేల్చకుండానే సీబీఐ దొంగ పోలీసు అట ఆడుతోంది. 90 రోజుల నుండి సీబీఐ కడప, పులివెందులలోనే తిష్టవేసి విచారణ కొనసాగిస్తోంది. రానున్న పది ఇరవై రోజుల్లో ప్రధానంగా ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిపించి అరెస్టు చేస్తుందో లేదో చూడాలి. ఒక వేళ సిబీఐ ఈ కేసులో తప్పుదారి పట్టి దిగువ స్థాయి వాళ్లనే అరెస్టుకు పరిమితం చేసి చార్జిషీటు దాఖలు చేస్తే గనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ ప్రతిష్ట మసకబారుతుంది.
2.AP High Court: రాజధాని రైతులకు గుడ్ న్యూస్..! ఆ జీవో కొట్టివేతతో షాక్..!!