YS Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగే రెండేళ్లు దాటిన సంగతి తెలిసిందే. పులివెందులలోని ఆయన నివాసంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి నెలలో దారుణ హత్యకు గురైయ్యారు. సీబీఐ దర్యాప్తు బాధ్యతలు చేపట్టి ఏడాది దాటింది. ఇంత వరకూ దోషులను గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం వివేకా కుమార్తె సునీతా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక కామెంట్స్ చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చిన్నాన్న హత్య కేసు విషయంలోనే న్యాయం జరగకపోతే సామాన్యులకు ఏమి న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటి వరకూ సీబీఐ అధికారులను అనేక మార్లు కలిశాననీ, నేడు కూడా సీబీఐ అధికారులను కలవడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి మరణించారన్నారు విచారణ ఆలస్యమైతే రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారని అన్నారు. న్యాయం కోసం ఎంత కాలం వేచి చూడాలన్నారు. సీబీఐ ట్రాక్ రికార్డు చూసుకుంటే చాలా హై ప్రొఫైల్ కేసులను సమర్థవంతంగా దర్యాప్తు జరిపి నిందితులు అరెస్టు చేశారని దీని వల్ల తనకు ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు వల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందన్నారు. మరో సారి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రాదని భావిస్తున్నాననీ, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.
YS Viveka murder case : దోషులను త్వరగా గుర్తించాలి
ఈ కేసు విషయంలో ఓ ఉన్నతాధికారిని కలిస్తే కడప, కర్నూలులో ఇలాంటి ఘటనలు సాధారణమని అనడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మరి కొందరు అయ్యిందేదో అయిపోయింది, పోరాటం ఆపేయి లేకుంటే తన పిల్లలపై ఆ ప్రభావం చూపుతుందని కూడా సూచిస్తున్నారని అన్నారు. పిల్లల కోసం ఆలోచించి స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు జరుపుతున్నా ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకమని అన్నారు. దోషులు స్వేచ్చగా తిరుగుతున్నారన్నారు. దర్యాప్తులో ఆలస్యం జరిగితే సాక్షాలు ఎక్కడ తారుమారు అవుతాయోననే సందేహం కలుగుతోందని అన్నారు. తాను చేస్తున్న ఈ న్యాయపోరాటంలో అందరి సహకారం కావాలని కోరారు. హత్య వెనుక ఎవరు ఉన్నారో విచారణలో అధికారులు నిగ్గు తేల్చాలని సునీత కోరారు.
తప్పు జరిగిందని వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు తెలుసుననీ, ఆమె తనకు అండగా ఉంటుందని సునీత అన్నారు. తన తండ్రికి శత్రువులు ఎవరూ లేరనీ, ఆర్థికపరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. తనకు తెలిసినంత వరకూ ఇది రాజకీయ హత్యేనని అన్నారు. అనుమానితుల పేర్లు హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నాననీ, ఆ తరువాత సీబీఐ విచారణ అధికారుల వద్ద వెల్లడించడం జరిగిందన్నారు. సీబీఐ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉందని తాను భావించడం లేదన్నారు. కానీ విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయం వేస్తుందన్నారు. ఆధారాలు కూడా దొరకకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. న్యాయం కోసం సీఎం జగన్ తో సహా అవసరం అనుకున్న అందరి తలుపులూ తట్టానన్నారు. పిఎంఓ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, హోం మంత్రి ఇలా అందరినీ కలిసినట్లు వెల్లడించారు. సీబీఐ విచారణలో జాప్యం జరుగుతుండటం వల్ల మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.