YS Viveka Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో నిన్న ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 47 రోజులుగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలాన్ని జమ్మలమడుగు కోర్టు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించారు. రంగయ్య ఇచ్చిన వ్యాగ్మూలంపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కీలక వ్యక్తుల పేర్లు బయట వెల్లడించారనీ, సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసిందనీ ఇలా ఏవేవో కథనాలు వచ్చాయి. కొన్ని విషయాలు వాచ్ మెన్ రంగయ్య కు తెలిసే అవకాశమే లేనివి కూడా ప్రచారంలో ఉండటంతో నమ్మశక్యంగా లేవనే వాదన వినబడుతోంది.
Read More: YS Viveka Murder: ఆ ఇద్దరూ ఈ ఇద్దరేనా..!? వైఎస్ వివేకా హత్య ఆ రాత్రి జరిగిన రహస్యం..!?
అయితే రంగన్న విషయంలో సీబీఐ అధికారులు కనబర్చిన తీరు ఆక్షేపణీయంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. కీలక సాక్షిగా కడప నుండి రంగయ్య ను తీసుకువెళ్లి జమ్మలమడుగు తీసుకువెళ్లిన సీబీఐ అధికారులు సెక్షన్ 164 కింద వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఫక్రుద్దీన్ వద్ద రికార్డు చేయించిన అనంతరం ఆయనను ఇంటి వద్ద పోలీసు వాహనంలో దిగబెట్టకుండా బస్టాండ్ లో వదిలివేసి వెళ్లారు. కీలక కేసులో సాక్షులకు కల్పించే భద్రత ఇదేనా అని అధికారుల తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. రంగయ్య మెజిస్ట్రేట్ వద్ద ఏ విషయాలను వెల్లడించాడు అనేది తెలుసుకునేందుకు పలువురు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా ఆయన ఏమి చెప్పలేదు. తనకు ఏమి జ్ఞాపకం లేదనీ, ఏమి చెప్పానో తనకే తెలియదంటూ చెప్పుకొచ్చాడు. మెజిస్ట్రేట్ సమక్షంలో జరిగిన విషయాలు ఏమీ బయట వెల్లడించవద్దని కూడా సీబీఐ అధికారులు రంగయ్యకు చెప్పినట్లుగా సమాచారం.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే రంగయ్య కీలక విషయాలు మెజిస్ట్రేట్ వద్ద వాగ్మూలంగా ఇచ్చాడని తెలియడంతో ఈ హత్య కేసులో తెరవెనుక ఉన్న వారు భయంతో అతను ఏవిషయాలు చెప్పాడో తెలుసుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడటం గానీ, వ్యక్తులను పంపించి అతనితో మాట్లాడే అవకాశం ఉంది. ఈ విషయాలను తెలుసుకునే క్రమంలో భాగంగా ఓ పథకం ప్రకారం సీబీఐ అధికారులు అతనితో వాగ్మూలం మెజిస్ట్రేట్ వద్ద ఇప్పించి ఫ్రీహాండ్ గా వదిలివేసి ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు. ఈ కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సుథాసింగ్ అకస్మికంగా బదిలీ కావడం, అది జరిగిన 24 గంటల వ్యవధిలో కీలక అడుగుగా వాచ్ మెన్ రంగయ్యను మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చి వాగ్మూలాన్ని రికార్డు చేయడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో త్వరలో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.