YS Viveka: మరో సారి దస్తగిరి వాగ్మూంలం
ఏ 4 నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నాడనీ 306 సెక్షన్ కింద సాక్షం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇతర ముగ్గురు నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి అప్రూవర్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. సాక్షిగా దస్తగిరి స్టేట్ మెంట్ నమోదు చేయాలని పులివెందుల కోర్టును సబ్ కోర్టు ఆదేశించింది. దీంతో దస్తగిరి సాక్షిగా తాను చేసింది, తాను చూసింది కోర్టుకు చెప్పనున్నారు. ఆయన చెప్పిన విషయాలను ముద్దాయి చెప్పినట్లుగా కాకుండా సాక్షి చెప్పినట్లుగా కోర్టు నమోదు చేస్తుంది. ఈ కేసులో గతంలో దస్తగిరి చెప్పిన వాగ్మూలం ఆధారంగా ఎర్ర గంగిరెడ్డి, ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్ రెడ్డిలు కీలక నిందితులు కాబోతున్నారు. వీళ్లిద్దరిలో ఇప్పటికే శివ శంకర్ రెడ్డిని శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఒక పక్క దస్తగిరి స్టేట్ మెంట్ రెడీ అవుతోంది. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ లో శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారణ జరుపుతోంది. పులివెందుల కోర్టు శివశంకరరెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. సీబీఐ విచారణలో శివశంకర్ రెడ్డి చెప్పే విషయాలు కీలకం కానున్నాయి. ఇంకా తెరవెనుక ఎవరు ఉన్నారు అనేది వెల్లడి అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ హత్య కేసులో మరో నిందితుడు ఏ 1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని 20 రోజుల క్రితం కడప నాల్గవ అదనపు జిల్లా కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపి 29వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇక సీబీఐ దస్తగిరి స్టేట్ మెంట్ ను పులివెందుల కోర్టులో రికార్డు చేయించడం, శివశంకరరెడ్డి విచారణలో వెల్లడించే విషయాలతో వివేకా హత్య కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేది సీబీఐ గుర్తించే అవకాశం ఉంది. అదే విధంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు కోర్టు అంగీకరిస్తే ..ఆయనను కస్టడీకి తీసుకుని దస్తగిరి చెప్పిన విషయాల ఆధారంగా ఆయనను సీబీఐ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వివేకా హత్య కేసులో వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే మరో వారం రోజుల్లో కీలక వ్యక్తుల అరెస్టు కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.