YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడుగా భావిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సీబీఐ అధికారులు సేకరించిన కీలక సమాచారంతో కడప ఎంపి అవినాష్ రెడ్డి పీఏలను, పులివెందుల సాక్షి మీడియా ప్రతినిధిని విచారించారు. ఈ పరిణామాల క్రమంలోనే వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ మరో సారి ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. ఇంతకు ముందు సీఐకి ఫిర్యాదు చేసిన సునీత తాజాగా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన ఇంటి ముందు అనుమానితులు రెక్కీ నిర్వహించారని తక్షణం తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. సునీత గతంలోనూ భద్రత కోసం లేఖ రాయడం జరిగింది.
సునీత ఎస్పీకి రాసిన లేఖలో మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికంఠ రెడ్డి వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనుచరుడని పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకరరెడ్డి ప్రధాన అనుమానితుడుగా ఉన్నారనీ, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో వివరించారు. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ తో పాటు డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు
మరో పక్క వివేకా హత్య కేసుల 68వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకరరెడ్డిని శుక్రవారం సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కేసులో శంకర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో పని చేసే రఘునాధరెడ్డి కూడా నేటి విచారణకు హజరైయ్యారు.