YS Viveka Murder: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వాచ్ మెన్ రంగయ్య చెప్పినట్లుగా కొన్ని విషయాలు మీడియాలో రావడంతో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. రంగయ్యతో తనకు అసలు పరిచయమే లేదని చెప్పిన గంగిరెడ్డి తాను ఎవరినీ బెదిరించలేదన్నారు. తాను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు లేవని అన్నారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదనీ, వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని గంగిరెడ్డి వివరించారు.
వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పై వాచ్ మెన్ రంగయ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వివేకాది సుపారి హత్య అని సీబీఐ విచారణ లో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు తన పేరు వెల్లడిస్తే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించాడని, అందుకే భయపడి తాను ఏమి చెప్పలేదని రంగయ్య చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తనపై ఈగ కూడా వాలనివ్వమని సీబీఐ అధికారులు చెప్పారని రంగయ్య తెలిపారు. రంగయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచనం అయ్యాయి. వీటిపై గంగిరెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు.
మరో వైపు వివేకా హత్య వెనుక ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారని రంగయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాచ్ మెన్ రంగయ్య వాగ్మూలాన్ని నిన్న సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టు మెజిస్ట్రేట్ వద్ద రికార్డు చేయించిన విషయం తెలిసిందే. ఈ సారి దర్యాప్తులో కేసు ముగింపు దశకు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కీలక దశలో ఉన్న సమయంలో దర్యాప్తు అధికారిణిగా ఉన్న సుధాసింగ్ బదిలీ కావడంతో కేసు మళ్లీ మొదటికి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.