YS Viveka Murder Case: ఏపిలో ప్రకంపనలు రేపుతోన్న వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంది అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యకు మూడు నాలుగు కారణాలు ఉన్నాయంటూ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి వెల్లడించారు. సీబీఐ అధికారులు ఆ దిశగా విచారణ చేయకుండా వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తు జరుపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వివేకా రెండో భార్య షమీమ్ నుండి సైతం సీబీఐ అధికారులు వ్యాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్ మెంట్ లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి పేర్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.
షమీమ్ తన స్టెట్ మెంట్ లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందని చెప్పారు. 2015 లో తమకు షేహాన్ షా (కొడుకు) జన్మించినట్లు తెలిపారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రడ్డి బెదిరించేదని చెప్పారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని అన్నారు. బెంగళూరు భూ సెటిల్ మెంట్ లో రూ,.8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారన్నారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారన్నారు. షేహన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తానని వివేకా చెప్పేవారన్నారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి బెదరించారన్నారు. ఆ కారణంగా చనిపోయాడని తెలిసినా రాలేకపోయానని పేర్కొన్నారు. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని తెలిపారు షమీమ్. తమ కుమారుడు షెహన్ షా పేరుతో నాలుగు ఎకరాల పొలం కొందామని వివేకా అనుకున్నారనీ, కానీ దాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఆపేశారని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరులోగా సీబీఐ కేసు విచారణ పూర్తి చేయాల్సిన తరుణంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మరింది. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి ఒక సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఈ కేసులో అరెస్టు అయిన భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డిలను మూడు రోజులుగా సీబీఐ విచారించారు. ఈ నెల 24వ తేదీ వరకూ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించనున్నది.