YSR Asara Scheme: డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభ వార్త అందించింది. దసరా పండుగకు ముందే వైఎస్ఆర్ ఆసరా రెండో విడత మొత్తాలను ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమానికి ప్రభుత్వం మూహూర్తం ఖరారు చేసింది. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్ఆర్ ఆసరా రెండో విడుదలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల మంది పొదుపు ఖాతాల్లోకి 6,792 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలునకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కానీ ఈ పథకం కొత్తది కాకపోవడం వల్ల రెండో విడత కార్యక్రమం అమలునకు అనుమతి ఇచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈసీ నుండి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో సీఎం జగన్ నేడు ఈ పథకం ద్వారా లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
Read More: CM YS Jagan: మరో వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయంపై దుమారం…! అది ఏమిటి..? కారకులు ఎవరంటే..!?
YSR Asara Scheme: ఒంగోలులో ప్రారంభించనున్న సీఎం జగన్
ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమానికి హజరుకానున్నారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి హెలిపాడ్ నుండి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోల పీవీఆర్ బాలుర హైస్కూల్ కు చేరుకుంటారు. హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం జగన్ పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. అనంతరం 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుండి 12 గంటల వరకూ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తదనంతరం 12.30 గంటలకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు.
మండలాల్లో రేపటి నుండి పంపిణీ కార్యక్రమాలు
ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బును ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు వినియోగించుకోవచ్చు. రేపటి నుండి 17వ తేదీ వరకూ పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.