ysrcp : సాధారణంగా ఎన్నికల సమయంలో ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి కార్యకర్తలు, నేతలు చేరడం సహజమే. అయితే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. అయితే ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్ లో అయ్యింది. అధికార పార్టీ నుండి దాదాపు 60 కుటుంబాలు టీడీపీకి చేరిపోయి మహిళా ఎమ్మెల్యేకి భారీ షాక్ ఇచ్చారు.
స్థానిక ఎన్నికలు ఇప్పుడు వస్తాయని ప్రభుత్వం, అధికార వైసీపీ అసలు ఊహించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు సిద్దం గా లేరు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్పేసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగు తిన్న ప్రభుత్వం వెంటనే హైకోర్టుకు వెళ్లి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోందంటూ చెప్పి ఎన్నికల షెడ్యుల్ ను రద్దు చేయించింది. అయితే హైకోర్టు సింగిల్ జడ్డి ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడంతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అయ్యింది.
దీంతో రాష్ట్రంలో స్థానిక సంగ్రామం మొదలైంది. తొలి దశ ఎన్నికల నామినేషన్ ల స్వీకరణలు పూర్తి అయ్యయి. పలు జిల్లాలలో అధికార పార్టీ నేతలు వివిధ రకాల ప్రలోభాలతో ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని కండువాలు కప్పేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గంలో అధికార వైసీపీ నుండి దాదాపు 60 కుటుంబాల వారు ఎన్నికల తరుణంలో టీడీపీలో చేరడం విశేషం. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వీరు టీడీపీలో చేరారు. ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉషాశ్రీ చరణ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరినప్పటికీ కార్యకర్తలు, నేతలు ఆమె గెలుపునకు కృషి చేశారు. అయితే గెలిచిన తరువాత ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉంటున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
దీనికి తోడు అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు మధ్య కూడా సన్నిహత సంబంధాలు లేవని అంటున్నారు. ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా ఉండగా టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి ఉమామహేశ్వర్ నాయుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గతంతో పోల్చుకుంటే చాలా వరకు మెరుగుపడింది అని అంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ దాదాపు 60 కుటుంబాల వారు అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఎమ్మెల్యే పనితీరుతో విసిగిపోయి తాము పార్టీ మారుతున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పడం గమనార్హం.