YSRCP: రాష్ట్రంలో ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేవు కానీ పార్టీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నేపథ్యంలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కనబడుతోంది. ఈ తరుణంలోనే అధికార వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారనే వార్త ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పుకార్లలో ఏమైనా వాస్తవం ఉందా? అంతర్గత చర్చలు ఏమైనా జరగుతున్నాయా? అనేది పరిశీలిస్తే…నెల రోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్లీ తెలుగుదేశం పార్టీ చేరడానికి ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన బహిరంగంగా అయితే ఖండించలేదు కానీ అనధికారికంగా ఆయనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధుల వద్ద ఆయన ఖండించారు. ఇది లోకేష్ అనుకూల టీమ్ చేస్తున్న అబద్దపు ప్రచారంగా వంశీ కొట్టిపారేసినట్లు సమాచారం.
Read More: Huzurabad By Poll: హూజూర్నగర్ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని లెక్క ఇదీ..
మళ్లీ గత రెండు మూడు రోజులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా మళ్లీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సంప్రదింపులు జరుపుతున్నారని పుకారు షికారు చేస్తోంది. వీటితో పాటు వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారంటూ ఓ సెక్షన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే…ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలు మారాలంటే ఇప్పుడు మారారు. కారణం ఏమిటంటే అధికార వైసీపీ ప్రస్తుతం చాలా దూకుడుగా ఉంది. అధికార పార్టీలో ఉన్న వారు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం అంటే చాలా రిస్క్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలపైనే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నుండి ప్రతిపక్షంలోకి చేరితే వారిని అధికార పార్టీ చూస్తూ ఊరుకుంటుందా, అధికార బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి వారిని ఇరుకున, ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇది వారికి తెలుసు. అందుకే వారు ఈ సమయంలో సాహసం చేసే పరిస్థితి ఉండదు. అధికారాన్ని చూస్తూ చూస్తూ వదులుకునే ఎమ్మెల్యేలు అయితే ఉండరు. ఒక వేళ అసంతృప్తి ఏమైనా ఉన్నా ఎన్నికల వరకూ ఓపిక పడతారు గానీ ఇప్పుడే బయటపడే పరిస్థితి ఉండదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ లు మారరు. బయటపడరు. అప్పుడు కూడా రాబోయే ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు వస్తేనే పార్టీ మార్పుపై ఆలోచనలు చేస్తారు. ప్రస్తుతం జరుగుతుంది అంతా ఉత్తుత్తి ప్రచారం మాత్రమే అని చెప్పవచ్చు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థ గానీ, వైసీపీ అనుకూల సర్వే గానీ ఇటీవల ఓ సర్వే జరిపిందనీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీలో 60 మంది వరకూ ఎమ్మెల్యేల వరకూ ఓడిపోతారని, అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని తేలినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కక్ష సాధింపు చర్యలు, కోర్టు తీర్పులు తదితర కారణాల వల్ల అధికార పార్టీపై కొంత మేర అసంతృప్తి వచ్చిందంటూ పుకారు షికారు చేస్తున్నది. అయితే ఇదే క్రమంలో టీడీపీ బలపడినట్లుగా సర్వేలు ఏమీ చెప్పడం లేదు. సో..ఎమ్మెల్యేల ఫిరాయింపులు అనేది ఇప్పట్లో ఉండవు అనేది సుస్పష్టం.