వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాల కృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకట రమణ, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ బీసీలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ ఉద్దేమని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పెట్టామని చెప్పారు. జనాభా లెక్కల్లో బిసిల గణన చేయాలని డిమాండ్ చేశామన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ బీసిలను అక్కున చేర్చుకున్న నేత వైఎస్ జగన్ అని అన్నారు. బీసీల సంక్షేమానికి అనేక పథకాలను ఆయన తెచ్చారన్నారు. డెహ్రాడూన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన స్పీకర్ల సమావేశాల్లోనూ సీఎం జగన్ గురించే చర్చ జరిగిందని తెలిపారు. బీసీల కోసం అన్ని పథకాలను ఎలా అమలు చేస్తున్నారని మిగతా రాష్ట్రాల వారు తనను అడిగారని తెలిపారు. దేశంలోనే ఒక ట్రెండ్ ను సీఎం జగన్ సెట్ చేశారన్నారు. ఇలాంటి నాయకుడికి అందరం అండగా నిలవాలన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా బీసీలంతా జగన్ తోనే పొత్తు పెట్టుకుంటారని తమ్మినేని అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో బీసీ ముఖ్యమంత్రులు సైతం బీసీల కోసం ఇన్ని పనులు చేయలేదని అన్నారు. 56 కార్పోరేషన్లు తెచ్చి అందరికీ జగన్ గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. బీసీల కోసం రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు.