YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి, మేళ్లను వివరించేందుకు జిల్లాల వారీగా చైతన్య సదస్సులు నిర్వహించేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.
Read More: YSRCP: సీఎం సొంత జిల్లాలో..వైసీపీ నేతల బాహాబాహీ..!!
YSRCP: కొత్త జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులు
సమావేశం అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 139 బీసీ ఉప కులాలు ఉండగా 56 కార్పోరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు చేపట్టాలని నిర్ణయించామనీ, ముందుగా కొత్త జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో బిసీ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.31వేల కోట్లు బీసి సబ్ ప్లాన్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. బీసీ సంఘం రాష్ట్ర నేత జంగా కృష్ణమూర్తి సహా తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ నేతలు, ప్రజలను సమాయత్తం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఏప్రిల్ 15 తేదీ తరువాత పర్యటనలు చేస్తామని తెలిపారు.
విద్యుత్ చార్జీలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఇదే సందర్భంలో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనపైనా ఆయన స్పందించారు. టీడీప ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు చెల్లుబోయిన. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై టీడీపీ ప్రభుత్వం భారం వేసిందన్నారు. విద్యుత్ చార్జీలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో,ఆదుకుంటుందో అనే విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.