Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికను వైసీపీ సీరియస్ గా తీసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికలైన పంచాయతీ, మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికలతో పాటు తిరుపతి బై పోల్ లోనూ వైసీపీ తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపు నల్లేరుమీద నడకే అయినప్పటికీ అతివిశ్వాసంతో ఉండకూడదంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య 44వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఆయన అనారోగ్యంతో మార్చి నెలలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీ సంప్రదాయం ప్రకారం దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ ను పార్టీ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. ఇంతకు ముందు వచ్చిన మెజార్టీని క్రాస్ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు వైఎస్ జగన్. ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్… ముగ్గురు మంత్రులు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాధ్యతలను అప్పగించారు.
గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన సమయంలో అప్పటి అధికార పార్టీ టీడీపీ పెద్ద ఎత్తున నేతలను మోహరించింది. అయితే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి నాటి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి కూడా అదే రీతిలో నేతలను మోహరిస్తున్నారు. కడప జిల్లా సిఎం జగన్ సొంత జిల్లా కావడంతో ఏ మాత్రం పొరబాటు జరిగి ఫలితం తిరగబడితే అది పార్టీ పై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉన్నందున వ్యూహాత్మక చర్యలు చేపట్టింది వైసీపీ.
Badvel By Poll: 13 మంది నేతలకు బాధ్యతలు అప్పగింత
మొత్తం ఏడు మండలాలు ఉన్న బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు 13 మంది హేమాహేమీ నేతలను జగన్ దింపారు. ఈ బృందానికి ఇన్ చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని జగన్ ప్రకటించారు. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో పని చేస్తున్న ఈ బృందంలో కడప జిల్లాకు చెందిన డిప్యూటి సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. వీరికి అదనంగా మండలానికి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలను అప్పగించారు. బద్వేల్ మండలానికి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలసపాడు మండలానికి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి, పోరుమామిళ్ల మండలానికి ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, గోపవరం మండలానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. కాశినాయన మండలానికి మాజీ ఎమ్మెల్యే, కడప జడ్ పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బి కోడూరు మండలానికి పార్టీకి చెందిన రఘురాంరెడ్డి, అట్లూరు మండలానికి రవీంద్ర రెడ్డిలను నియమించారు. బద్వేల్ మునిసిపాలిటీకి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిని నియమించారు. ఇలా మొత్తం 13 మంది కీలక నేతలను ఏడు మండలాలకు వైసీపీ దింపింది.
కాంగ్రెస్, బీజేపీ పోటీపై రాని స్పష్టత
కాగా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనుంది, నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నోటిఫికేషన్ విడుదల కానుంది. టీడీపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ – జనసేన అభ్యర్థుల పోటీలపై ఇంకా స్పష్టత రాలేదు.