YSRCP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఏమైనా ఉంది ఉంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. హత్యకు గురైన వివేకా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బాబాయ్ కావడం, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును విచారణ చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక కేసుగా ఉంది. కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకున్న దశలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మాట్లాడటం వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది.
YSRCP: కోర్టులో పిటిషన్
సునీత ఇన్నాళ్లూ జగన్మోహనరెడ్డికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు షడన్ గా మాటమార్చడంతో వీళ్లపైనే అనుమానాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకూ గుట్టుగా కాపాడుకుంటూ వచ్చిన వివేకా కుటుంబ వ్యవహారం బహిర్గతం చేశారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డిని వీరు అనుమానించడంతో కుటుంబ వ్యవహారాలను తెరిపైకి తీసుకువచ్చి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పైనా అనుమానం వచ్చేలా పలు ఘటనలు ఉదహరిస్తున్నారు. వైఎస్ సునీత భర్త పాత్రపై విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
YSRCP: ఆస్తి గొడవ కూడా
సునీత వివేకానందరెడ్డికి మొదటి భార్య సంతానం కాగా, తర్వాత ఆయన మరొక యువతిని పెళ్లాడారనీ, ఆమెకు ఒక సంతానం ఉందని చెబుతున్నారు. తమకి చెందాల్సిన వివేకా ఆస్తి ఆమెకెక్కడికి పోతుందోనని సునీత ఆమెతో గొడవ కూడా పడిందనీ, ఇవన్నీ బయటకు వస్తే కుటుంబ పరువు మంటకలుస్తుందన్న భావనతో ఇప్పటి వరకూ వెల్లడించలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీతో కలిసి జగనన్నను అవమానించినందుకు సునీతకు జరగాల్సిన శాస్తి జరుగుతోందని వైసీపీ అభిమానులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.